Showing posts with label art. Show all posts
Showing posts with label art. Show all posts

Wednesday, November 23, 2011

ఉలి వాడని '' శిల్పి ''

‘నాలుగు రాళ్లు’ వెనకేసుకోవడం అంటే ఆస్తి కూడబెట్టడం అనుకుంటాం మనం...‘నాలుగు రాళ్లు’ పోగేసుకోవడం అంటే అందమైన బొమ్మలను తీర్చిదిద్దడం అనుకుంటుంది ఆమె... ఉలితో చెక్కకుండానే రకరకాల రాళ్లు ఆమె చేతిలో ఒద్దికగా ఒదిగి రూపుకడతాయి.. రతనాల కన్నా రాళ్లనే మిన్నగా భావించే ఆమె పేరు సుజాత. ఉలి వాడని శిల్పిగా ఆమె పరిచయం ..


‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్లు తట్టెడేల?’ అంటే.. తళుకు బెళుకులు లేకపోయినా ఫర్వాలేదు రాయి అయితే చాలు అంటారు సుజాత. ఇల్లు కట్టడానికా! పొయ్యి వెయ్యడానికా..? అనే సందేహంతో ఎవరైనా చూస్తే ‘షోకేసుల్లో పెట్టడానికి’ అనే సమాధానం వస్తుంది ఆమె నుంచి. అవును, సుజాత రాళ్లతో బొమ్మలను చేస్తుంది. అదీ ఉలితో చెక్కకుండా. ఉలి లేని శిల్పిగా సుజాతకు, ఆమె చేతిలో రూపు కట్టిన బొమ్మలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు కావాలంటే సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న ఆమె నివాసానికి వెళ్లాలి.

అపురూపం.. ఆ బొమ్మ
ముప్పై అయిదేళ్ల సుజాత చదువుకున్నది టెన్త్ క్లాసే. 2, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గుండెపోటు వచ్చి ఏపనీ చేయలేని భర్త. ఒకటే అనిపించే రెండు గదుల అద్దె ఇంట్లో నివాసం. ఇదీ సుజాత సామ్రాజ్యం. అందులో ఆమెకున్న ఆస్తిపాస్తులు మాత్రం ఏడాదిగా పోగేసుకున్న వందలకొద్దీ రాళ్లు. సమయం చిక్కితే ఆ రాళ్లను ముందేసుకొని వాటికి బ్రష్‌తో రంగులేస్తూ, ఏ రాయి ఇంకో రాయికి అతికించవచ్చో చూసుకుంటూ ఉంటుంది. కోరుకున్నరూపం వచ్చాక తనకు తాను మురిసిపోతుంది.

తర్వాత కూతుళ్లను పిలిచి తన చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మను చూపించి సంబరపడిపోతుంది. ఆ రాతిబొమ్మను అపురూపంగా తీసుకెళ్లి షెల్ఫ్‌లాంటి చెక్కలపైన నిలబెడుతుంది. రాయి మీద రాయిని పేర్చి బొమ్మలుగా మలుస్తున్న ఈ కళ సుజాతను కోరి కోరి ఎలా వరించిందో తెలపమంటే కళ్లింతలు చేసుకుంటుంది.‘‘ఏడాదిక్రితం మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు. లారీల కొద్ది ఇసుక తెచ్చి పోశారు. ఓ రోజు చుట్టుపక్కల ఆడవాళ్లం ఆ ఇసుకలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. చేతులు ఊరుకోవు కదా! ఇసుకలో అటూ ఇటూ కదుపుతుంటే చేతికి గోధుమ వర్ణంలో ఉన్న ఓ రాయి దొరికింది.


ఆ రాయిని ఎందుకో అక్కడ వదిలేయాలనిపించలేదు. ఇంటికి తెచ్చి షెల్ఫ్‌లో పెట్టాను. రోజూ ఆ రాయిని చూస్తుండేదాన్ని. ఆ రాయితో ఏదో తెలియని అనుబంధం. ఏదో మనసును తట్టే బొమ్మ.. చూడగా చూడగా గణేషుని బొమ్మలా అనిపించింది. బయటకు వెళ్లినప్పుడు ఎమ్‌సీల్(రకరకాల వస్తువులు అతికించడానికి వాడేది), పెయింట్, బ్రష్ కొనుక్కొచ్చాను. తొండం, చెవులు, కిరీటంగా మళ్ళీ రాళ్లు వెతికి తెచ్చి అతికించాను. చూడముచ్చటనైన గణేషుని రూపం. పార్వతీదేవి నలుగుపిండితో గణేషుని తయారుచేసుకుంటే, నేను రాయితో చేశాను అన్న ఆలోచన రాగానే ఉద్వేగంతో కళ్లలో నీరు పొంగింది. ఆ బొమ్మను దేవుని మందిరంలో పెట్టాను.’’ అంటూ తన తొలికళ విఘ్నరాజుతో నిర్విఘ్నంగా వంటపట్టిందని ఆనందంగా చెబుతుంది సుజాత.



రోడ్డుపాలు...
‘ఈ బొమ్మల్ని ఇంట్లో ఉంచితే ఎవరికి తెలుస్తుంది. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌గా పెట్టు’ అన్న వాళ్ల మాటలు పట్టుకొని ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో టేబుల్ వేసుకొని దాని మీద రాతి బొమ్మల కొలువు పెట్టింది సుజాత. వచ్చి చూసిన వాళ్లు ‘ఔరా’ అని ఆశ్చర్యపోవడమే తప్ప వాటికి ఎక్కడ గుర్తింపు వస్తుందో చెప్పేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేసింది. హస్తకళల వారిని కలిసి తన బొమ్మలను చూపించింది. బొమ్మలు బాగున్నాయని అన్నవారే తప్ప, ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వలేదు. సభ్యత్వం తీసుకోవాలన్నారు.

అందుకు డబ్బులు కట్టాలన్నారు. ఎక్కడ తీసుకోవాలో, ఎవరిని అడగాలో, ఎంత డబ్బు కట్టాలో తెలియదు. తనకు తెలిసిన ఈ కళ ఇక్కడే మరుగునపడిపోతుందేమో అనేదే సుజాత బాధ. రాతిబొమ్మలకు పేరు తేలేకపోవడం తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడమే కారణమంటుంది. ‘‘అక్క దగ్గర నేర్చుకున్న బ్యుటీషియన్ పనే ఇప్పుడు నా కుటుంబానికి ఆదరవు. తెలిసినవారు కోరితే వారి ఇళ్లకే వెళ్లి బ్యుటీషియన్ పనులు చేసి వస్తాను.


ఇంట్లో నలుగురి కంచంలోకి నాలుగు మద్దలు రావాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్లాలి కదా’’ అనే సుజాతకు ఈ బొమ్మల వల్ల ఉపయోగమేంటో తెలియదు. రేపటి తరానికి వాటి ద్వారా ఏం అందించవచ్చో తెలియదు. ఇలాంటి కళకు దేశ విదేశాలలో ఎక్కడెక్కడ, ఎలాంటి పేరుందో! తెలియదు. అందుకే మూలన పడేయడంతో విరిగిన బొమ్మలు, కావాలని అడిగిన వారికి ఇచ్చేసిన బొమ్మలు, పిల్లలు ఆడుతూ ఆడుతూ రోడ్డు మీద వదిలేసి వచ్చిన బొమ్మలు, ప్రాణం చివుక్కుమన్నా స్థలం సరిపోక వద్దనుకున్న బొమ్మలు ఎన్నో... కాని రాయి కనపడితే చాలు అది ఏ బొమ్మగా రూపుకట్టవచ్చో ఆలోచన చేస్తుంది. దానిని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్ది బొమ్మను చేస్తుంది. ఈ ఉలి చెక్కని బొమ్మల విలువ తెలిసినవారెవరైనా వాటికో స్థానం క లిపిస్తే చాలనుకుంటుంది సుజాత.


కళలు తెలిసిన వారు అరుదు. తమకు తాముగా నేర్చుకుని కళకు ప్రాణం పోసే వారు మరీ అరుదు. స్వతహాగా అబ్బిన ఈ కళ సుజాత జీవితాన్ని సుసంపన్నం చేస్తుందని ఆశిద్దాం.


ఒకటికి ఒకటి...
‘‘బయట ఏదైనా రాయి కనిపిస్తే చాలు, దానికి సరిపోయే రాయి నా దగ్గర ఏది ఉంది? అని చెక్ చేసుకుంటాను. కొన్ని రాళ్లు పక్షుల రెక్కల్లా ఉంటే కొన్ని తలల్లా, మనుషుల చేతుల్లా.. ఏదో ఒక అవయవ రూపంలో కనిపిస్తాయి. ఒకటి దొరికనప్పుడు దానికి అనువైన మరో రాయి దొరికే దాకా ఎదురుచూడక తప్పదు’’ అంటూ రాతిబొమ్మల రూపకల్పనలో పట్టే సమయాన్ని వివరిస్తుంది ఆమె. తిమింగలం, నెమలి, చేప, కప్ప, ఎలుక, జూజూ, గుర్రం, కుక్క, జోకర్, ఏలియన్ మాస్క్, మర్రిచెట్టు, శివలింగం, రామచిలుకలు, వృద్ధుడు, రాకాసి, ... చెప్పుకుంటే పోతే వందల కొద్ది బొమ్మలు సుజాత చేతిలో రూపుకట్టి మనల్ని అబ్బురపరుస్తాయి.

- నిర్మలారెడ్డి
ఫొటోలు: అమరశ్రీనివాసరావు. వి

Thursday, May 19, 2011

అశేష కీర్తి గిరి చిత్రాలు * కొండపల్లి శేషగిరిరావు

seshagiri_pic3
కొండపల్లి బొమ్మలు ఈ తరం వారికి కొత్తేమోగానీ పాతతరం వాళ్ల ఇళ్లల్లో కొలువుతీరి ఉంటాయి ఆ కొయ్యబొమ్మలు. ప్రత్యేకించి బొమ్మల కొలువుల్లో కొండపల్లి బొమ్మలు ఉండితీరాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందిన కొండపల్లి బొమ్మలు చూడటానికి అచ్చం కొండపల్లి శేషగిరిరావు గీసిన బొమ్మల్లానే ఉంటాయి. అంతలా జీవకళ ఉట్టిపడుతుంటుంది శేషగిరిరావుగారి కళాత్మక చిత్రాలలో. ఆదరణ కరవై కొండపల్లి బొమ్మలకు గిరాకీ తగ్గిందిగానీ అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గవు కొండపల్లి బొమ్మలు. అంతగా గుర్తుకుతెచ్చే కొండపల్లినే ఇంటిపేరుగా చేసుకుని శేషగిరిరావు అనే ప్రసిద్ధ చిత్రకారుడు తన విశేష పేరుప్రతిష్టలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయక యావత్‌ భారతావని మెచ్చే స్థాయికి వ్యాప్తిచెందడమంటే అంత తేలికైన విషయం కాదు. ఎనిమిది పదుల వయసులోనూ వన్నెతగ్గని కళాఖండాలను ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంటారు ఆయన. ఇంటిపేరు కొండపల్లి అయినా శేషగిరిరావు పుట్టింది మాత్రం తెలంగాణకే తలమానికమైన పోరుగడ్డ వరంగల్‌ జిల్లాలోని పెనుగొండలో 1924 సంవత్సరంలో జన్మించారు. పెనుగొండలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసి వరంగల్‌ ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన.

seshagiri_pic 

లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్రా : పౌరాణిక, దృశ్య కావ్య నాయకానాయికలను, మనసుకు హత్తుకుపోయే వివిధ సుందర దృశ్యాలను మనోహరంగా చిత్రించడమేకాక కుడ్య చిత్రలేఖనంలో కూడా శేషగిరిరావుకు సాటి ఆయనే అనిపించుకొన్నారు. కొండపల్లి వేసిన బొమ్మలు పరోక్షంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’ అనే అతి బృహత్తర చిత్రం అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో వేదిల మీద మనకు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వాటిని చూడటం తటస్తించివుంటుంది. కాకపోతే చాలామందికి ఆయన పేరు మాత్రం తెలియదు. టీవీ ఛానల్స్‌, వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రజలు ఏదో ఓ సందర్భంలో ఆ చిత్రాన్ని తిలకించి ఉంటారు.అయితే ఆ చిత్రం ‘కొండపల్లి’ శేషగిరిరావుదే అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియనే తెలియదు.

seshagiri_pic1 

సైన్స్‌ మాస్టార్‌ స్ఫూర్తి : కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్‌ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనంలోనే సామాన్యశాస్త్రంలో గీయవలసిన బొమ్మల్ని తన పాఠ్యపుస్త్తకంలో ఉన్నదానికన్నా ఎంతో అందంగా చిత్రించేవారు. చిన్నతనంలోనే కొండపల్లి శేషగిరిరావులో ఉన్న సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ అయిన దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. దీంతో కొండపల్లి కళాచతురతను ప్రప్రథమంగా ఆ పాఠశాల డ్రాయింగ్‌ టీచరు దీనదయాళ్‌ గుర్తించారు. పెన్సిల్‌తో ఏ రేఖలు ఎలా గీయాలో, కుంచెతో ఏ రేఖల్లో జీవం ఎలా నింపాలో దీనదయాళ్‌ సార్‌ మన కొండపల్లికి నేర్ఫారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్ఫింది. రామప్ఫ గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం..శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్నివందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్ఫుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజాబాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.

seshagiri_pic2 

వరంగల్‌లో విద్యాభ్యాసం, చిత్రకళాభ్యాసం తర్వాత ఆయన హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌ చిత్రకళాశాలలో డిప్లొమా పొందారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఆయనకి నవాజ్‌ మిహిది నవాజ్‌తో పరిచయం కలిగింది. కొండపల్లి చిత్రకళా ప్రతిభ గుర్తించిన నవాజ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినిేకతనంలో అధునాతన చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేయడంవల్ల తగిన ఫలితం ఉంటుందని సూచించి, సహకరించడంతో కొండపల్లి ‘శాంతినిేకతన్‌’లో ప్రవేశించారు. సర్వకళలకు పుట్టినిల్లయిన శాంతినిేకతన్‌లో అప్పుడు నంద్‌లాల్‌బోస్‌ చిత్రకళా విభాగంలో ఉండేవారు. ఆయన కొండపల్లి కళాప్రతిభని గుర్తించారు. పాటించాల్సిన జాగ్రత్తలేమిటో నేర్ఫారు. ఆయన నేర్ఫిన మెలకువలతో కొండపల్లి ప్రతిభ బాగా వికసించింది. అక్కడే ‘కుడ్య’ చిత్రలేఖనంలో కూడా కొండపల్లి ప్రత్యేక శిక్షణ పొందారు. 1950లో హైదరాబాద్‌లో చిత్ర కళాపోటీలు భారీఎత్తున జరిగాయి. అఖిలభారత స్థాయిలో జరిగిన ఆ పోటీల్లో కొండపల్లి చిత్రం ప్రథమ బహుమతి సొంతం చేసుకొంది. ఆ సభలో పాల్గొన్న అప్ఫటి మంత్రి, కొండపల్లి చిత్రాన్ని ప్రశంసించడమే కాక హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ క్రాఫ్ట్‌‌సలో అధ్యాపకుడిగా కొండపల్లి శేషగిరిరావు పేరును ప్రతిపాదించారు.

అలా ఉద్యోగం చేపట్టిన కొండపల్లి శేషగిరిరావు ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆయన కళాత్మకత రాజకీయ నాయకులను విశేషంగా ఆకట్టుకోవడంతో హైదరాబాద్‌, బెంగళూరు, భావనగర్‌లలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు ద్వారాలు, వేదిక రూపకల్ఫన బాధ్యతలు కొండపలిే్లక అప్ఫగించారు. అవి అప్ఫటి ప్రధానమంత్రుల అభినందనలు అందుకొన్నాయి. అప్ఫటి ప్రభుత్వం చొరవతోనే ఆయన ‘‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ అనే బృహత్తర చిత్రాన్ని చిత్రించారు. అది అనేక పర్యాయాలు రవీంద్రభారతి, తెలుగు లలిత కళాతోరణం వంటి వేదికల మీద జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శితమై ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆయన ఉపాధ్యాయుడిగానే మిగిలిపోకుండా చిత్రకళా విస్తృతికి తానెంతో కృషిచేశారు. పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై ఎన్నో గ్రంథాలు కూడా రాశారు. 1982లో ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన దగ్గరకొచ్చే వారిని నిరాశపరచక మెలకువలన్నీ నేర్ఫారు. 1987 మే ఆరో తేదీన హైదరాబాద్‌లో ‘మాడపాటి సుకుమార్‌’ అవార్డు అందుకొన్న కొండపల్లి చిత్రకళా సాధన, బోధనల్లో ‘కొండపల్లి బొమ్మలంత’ సుస్థిర కీర్తిప్రతిష్టలను పొందారు.

మాస్కో, లండన్‌, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిఙత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమేనంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

-నండూరి రవిశంకర్‌

ముచ్చటగొలిపే ముప్పిడి చిత్రాలు

అతనొక ఉపాధ్యాయుడు...సృజనాత్మకత కలిగివున్న సామాజిక చిత్రకారుడు కూడా...మారుమూల కుగ్రామంలో ముదిరాజ్‌ కులంలో జన్మించి పల్లెటూరి జీవన విధానంపై అందమైన చిత్రాలను వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న అద్భుత చిత్రకారుడు అతడు. పేరు ముప్పిడి విఠల్‌. చిన్నతనం నుంచి అతని కళ్లముందు ఉట్టిపడే పల్లెల ప్రకృతి అందాలే ఆయనకు స్ఫూర్తిదాయకమయ్యారు. మెదక్‌ జిల్లాలోని కంగ్డిలోని తడ్కల్‌ గ్రామంలో ఒక నిరుపేద గ్రామంలో జన్మించారు విఠల్‌.

mupidi-pic 

పదవతరగతి వరకు స్వగ్రామంలోనే విద్యనభ్యసించిన విఠల్‌ ఇంటర్మీడియట్‌ నిజామాబాద్‌ జిల్లా బిచ్కుందలో పూర్తిచేశారు. తండ్రి లక్ష్మయ్య, తల్లి నాగమ్మ. నలుగురు సంతానంలో రెండవ సంతానం విఠల్‌. 1995లో సావిత్రితో వివాహం జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు మంచి ఆర్టిస్టులుగా ఎదుగుతై తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

రైతుకుటుంబం నుంచి వచ్చిన విఠల్‌ పేదరికం అనుభవించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ సాగారు. వివేకవర్ధిని డిగ్రీకాలేజీలో చదువు సాగిస్తూ ఉదయం పార్ట్‌టైమ్‌ జాబ్‌ కింద పెయింటింగ్స్‌ వేస్తూ తన సొంతకాళ్లమీద నిలబడి ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ సెకండియర్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్‌‌సలో మారి (పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) బి.ఎఫ్‌.ఏ. పూర్తిచేసారు. అనేక ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసి ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నారు. చిన్ననాటినుంచి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషిచేసి తన కుంచె నుంచి జాలువారిన అపురూప చిత్రాలు అశేష జనాదరణను పొందాయి. నిజానికి విఠల్‌కు స్ఫూర్తిగా నిలచినది కిషన్‌ మహరాజ్‌. ఆయన విఠల్‌ చదివిన హైస్కూల్‌కు హెడ్‌మాస్టర్‌గా ఉండేవారు. చిన్నతనం నుంచి విఠల్‌లో దాగివున్న సృజనాత్మకతను మొట్టమొదటిసారిగా గ్రహించి ఎంతగానో ప్రోత్సహించేవారు. అలాగే పోచాపూర్‌ మెగలప్ప అనే మరో ఉపాధ్యాయుడు విఠల్‌ను ఆర్టిస్టుగా ఎదిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించారు. ఒకరకంగా ఈ ఇద్దరు ఉపాధ్యాయ గురువులు తన జీవితానికి మార్గదర్శకులయ్యారు అంటారు విఠల్‌.
గ్రామీణ వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చిత్రాలు వేయడంలో ఎంతో దిట్ట విఠల్‌. 1994 సంవత్సరంలో హైదరాబాద్‌లోని జాంబాగ్‌ వద్ద గల వివేకవర్ధిని కళాశాలలో విఠల్‌ వేసిన వివేకానంద చిత్రపటానికి గాను కళాశాల యాజమాన్యం మెచ్చుకోలుగా కళాశాల తరపున బెస్ట్‌ అవార్డును అందజేసింది. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్విహంచిన సౌత్‌ జోన్‌ చిత్రలేఖనం పోటీలలో రజిత పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1997లో నిర్వహించిన జన్మభూమి చిత్రలేఖనం పోటీల్లో రాష్టస్థ్రాయిలో మూడవ బహుమతిని అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి చేతులమీదుగా అందుకున్నారు.
ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం పట్టిపీడిస్తున్న సమస్య. ఇటివంటి కాలుష్యాన్ని నివారించేందుకు తన చిత్రాల ద్వారా నేటి తరం విద్యార్థులలో చైతన్యం కలగజేసేందుకు కృషిచేస్తున్నారు. ఆ దిశగా కృషిచేస్తూ తన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్ల ద్వారా అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నారు.

mupidi-pic1 

బహుమతులు: 1998 సంవత్సరంలో నిర్వహించిన అంతర్‌ విశ్వవిద్యాలయం చిత్రలేఖనం పోటీలలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి రంగాచార్య చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో జరిగిన ముదిరాజ్‌ మహాసభల్లో విఠల్‌ వేసిన కార్గిల్‌ వార్‌ చిత్రాలకుగాను బంగారు పతకం లభించింది. అప్పట్లో దేశభక్తిని పెంపొందించే ఆ చిత్రాలతో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమం జరిపిద్దామనుకున్నారు విఠల్‌. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ కార్యక్రమం రూపుదిద్దుకోలేక పోయింది. అన్నీ కలిసొస్తే తొందరలోనే ఆ దేశభక్తిని రూపొందించే పెయింటింగ్స్‌తో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనేది ఆయన ఆశయం. 2002 డిసెంబర్‌ 31న శబరిమలైలోని దృశ్యాలను చూసి వాటిని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించినందుకుగాను శ్రీరాం ఇంటీరియర్స్‌ వారు బంగారు ఉంగరంతో ఘనంగా సత్కరించారు. అలాగే తన సొంత ఊరైన తడ్కల్‌లో అప్పటి దొరగారి కోట చిత్రాన్ని వేసి పోటీలకు పంపించారు విఠల్‌. ఈ చిత్రం రాష్టస్థ్రాయిలోనే చిత్రకళా ప్రదర్శనకు ఎంపికయింది. తన సొంత ఊరిలోని కోటను తన చేత్తో గీసుకుని ఎంతో తృప్తిని పొందానంటారు ఆయన.

mupidi-pic2 

ఆశయం: కాంటెంపరరీ ఆర్టిస్టుగా ఎదగాలని ఆకాంక్ష. ఇతర దేశాలలో కూడా మన దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉండాలని నా ఆశయం. మారుమూల పల్లె వాతావరణం ప్రపంచవ్యాప్తం కావాలని...అన్ని దేశాలలో కూడా ప్రత్యేకించి మన పల్లెవాతావరణం ఇనుమడింపజేయాలనేదే తన ఆశయం అంటారు విఠల్‌.

పిల్లలకు అవగాహన: చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకత శక్తిని వెలికితీస్తూ ...వారిని చిత్రకారులుగా తీర్చిదిద్దుతూ చిత్రలేఖనంలో వారికి ప్రోత్సాహం అందించేందుకుగాను 1999లో హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ముప్పిడి ఆర్ట్‌‌స గ్యాలరీని విఠల్‌ ప్రారంభించారు. ప్రతిసంవత్సరం వేసవికాలంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఆయన. తను పుట్టిపెరిగిన ప్రాంతపు పల్లె పొలాల స్థితిగతులే తన చిత్రాలకు ప్రేరణలంటారు విఠల్‌. అక్కడి ఎండిపోయిన చెరువులు, బీడులువారిన భూములు, ఎండిపోయిన పిల్లకాలవలు, పల్లె ప్రాంతంలో జనజీవన స్థితిగతులు...తన సొంత పొలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో చూసిన దృశ్యాలనే తన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిదాయకంగా పనికొచ్చాయంటారు విఠల్‌. నేటి తరం విద్యార్థులు కూడా పల్లె ప్రాంతాలను అలక్ష్యం చేయకుండా...పూర్తిగా సిటీ జీవనానికే అలవాటుపడకుండా అక్కడి ప్రాంతాలను కూడా సందర్శించాలంటారు విఠల్‌. అలాగే నేడు ప్రతి పాఠశాలలోనూ ఒక చిత్రలేఖనం నేర్పించే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలంటారు విఠల్‌. పిల్లలకు కేవలం చదువు ఒక్కటే పరమావధికాదని...చదువుతో పాటు ఇలా ఏదో ఒక కళమీద వ్యాపకం చాలా మంచిదని...ప్రస్తుత విద్యావిధానంలో అది లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు విఠల్‌. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు చిత్రకారులుగా మలిచే ఉపాధ్యాయులను నియమించాలంటారు. అలాగే తన సొంత మండలంలో ఒక వృద్ధ ఆశ్రమాన్ని నెలకొల్పాలనేది ఆయన ఆశయం అంటారు.

-నండూరి రవిశంకర్‌

Thursday, March 17, 2011

చిత్తరాల పూలతోట

madhu-d1ఏడు పదుల వయసుకు దగ్గరౌతున్నా...ఆయన కుంచెకు వన్నె తగ్గదు...ఆయన చిత్రాలకు ఖ్యాతి తగ్గదు...పల్లె పడచుల పైట అందం...పైరగాలుల తన్మయత్వం...ఆత్మీయానుబంధాల మేళవం...అన్నీ కలగలిపితే తోట వైకుంఠం అవుతుంది. తెలంగాణ ప్రాంతానిేక తలమానికంగా భాసిల్లుతున్న తోటవైకుంఠం భావోద్వేగాలను పలికింపజేసే చిత్రాలకు చిరునామాగా చెబుతారు. ప్రఖ్యాత సామాజిక స్పృహ కలిగిన మేటిదర్శకుడు బి.నరసింగరావు తన చిత్రాలకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అంతా తోట వైకుంఠానిక అప్పగించేవారు. 1942లో కరీంనగర్‌లో పుట్టిన తోట వైకుంఠం చిత్రకళాకారుడిగా అనన్యసామాన్యమైన పేరును సంపాదించుకున్నారు.

కిరాణాకొట్టు నడిపిస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న సామాన్యమైన వ్యక్తి ఆయన తండ్రి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బూరుగుపల్లి ప్రాంతంలో పుట్టిన తోట వైకుంఠం చిన్నప్పటినుంచి కూడా సాదాసీదా జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. చిన్నతనంనుంచి కూడా తోట వైకుంఠానికి తాను పుట్టిన ప్రాంతమన్నా...పల్లెవాతావరణమన్నా ఎంతో మక్కువ. అందుకే ఆయన గీసిన చిత్రాలలో ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తాయి ఆ చిత్రాలు.

madhu-dతన అభిరుచికి తగినట్లుగానే విద్యను కూడా అదే మార్గంలో కొనసాగించారు వైకుంఠం. అందుకు తండ్రి కూడా ఎటువంటి అభ్యంతరమూ పెట్టలేదు. ఎటువంటి షరతులు కూడా విధించలేదు. కొడుకు ఇష్టప్రకారమే చదివించారు. తోట వైకుంఠం తన అభిరుచికి తగినట్లుగా ఫైన్‌ ఆర్ట్‌‌స, ఆర్కిటెక్చర్‌ కోర్సులను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫైన్‌ ఆర్ట్‌‌స విద్యార్థులకు బోధకునిగా కొన్ని విద్యాసంస్థలలో పనిచేశారు.

తెలంగాణ సంస్కృతి మనకు ఆయన చిత్రాలలో అణువణువూ స్మృజిస్తుంది. దాసి చిత్రానికిగాను వైకుంఠం కళాదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి కేంద్రస్థాయిలో ఉత్తమ కళాదర్శకునిగా తోట వైకుంఠం అవార్డును అందుకోవడం విశేషం. ‘రంగుల కల’ చిత్రం ఓ చిత్రకారుని గురించిన అంశం. ఆ చిత్రాన్ని దర్శకుడు బి.నరసింగరావు ఎంతో హృద్యంగా తెరకెక్కించిన తీరు నభూతో నభవిష్యతి. ఇక ఆ చిత్రకారుడు గీసే బొమ్మలన్నీ సినిమా తెర వెనక గీసిన వ్యక్తి తోట వైకుంఠం. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే నరసింగరావు తన ప్రతిచిత్రంలోనూ ఏదోఒకరకంగా తోట వైకుంఠం పాల్గొనేలా చేస్తారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. వైకుంఠానికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చెట్టూ పుట్టా తిరిగి కాయకష్టం చేసి అలసి, సొలసిన శ్రమజీవులు మానసిక విశ్రాంతిని, పొందడానికి కళలను నమ్ముకొని తెలంగాణలో వేలాది మంది కళాకారులు బ్రతుకు బండిని కొనసాగించేవారు. ఇలాంటి ప్రాశస్త్యం కల్గిన విశిష్ఠ కళలతో పరవశించే తెలంగాణ పల్లెల ప్రకృతి అందాలను తోట వైకుంఠం తన కుంచెతో మన మనసుల్లో నిలిచిపోతారు.

నండూరి రవిశంకర్‌