Wednesday, October 27, 2010

సృజనకు కాస్త కళాత్మకత జోడిస్తే ....

కంది పప్పుతో కాసుల పేరు!

కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల.. అగ్గిపుల్ల.. ఇవి శ్రీశ్రీ కవిత్వానికి అర్హమైనవైతే.. ఖాళీ డబ్బా.. ప్లాస్టిక్ ముక్క.. పప్పుబద్ద... ఇవి అరుణ్‌జ్యోతి సృజనాత్మకతకు వస్తువులయ్యాయి. ఆమె చేతిలో అందమైన కళారూపాలుగా ప్రాణం పోసుకున్నాయి. వీటి కోసం ఆమె పెట్టిన పెట్టుబడేంటో తెలుసా..? బాధ్యతల మధ్య మిగిలిన ఖాళీ సమయం. 
ఆసక్తిగా ఉందా..? ఇవిగో వివరాలు..
ఇంట్లో పేస్ట్ అయిపోతే మీరేం చేస్తారు? పారేస్తామండీ బాబూ...! అగ్గిపెట్టెలో పుల్లలు అయిపోతే..? చెత్తబుట్టలో వేస్తాం. పాడయిపోయిన, విరిగిపోయిన డబ్బాలు గట్రాలను ఏం చేస్తారేంటి? ఇనప సామాన్లకు అమ్మేస్తాం. లేదంటే అటకమీదకెక్కిస్తాం. పనికిరాని వాటితో పనేంటి అంటారా? 'అయ్యో...వాటితోనే పని' అంటున్నారు నల్గొండకు చెందిన అరుణ్‌జ్యోతి ఎస్.లోఖండే.

సృజనకు కాస్త కళాత్మకత జోడిస్తే అయిపోయిన పేస్ట్ ట్యూబు, ఖాళీ కంటైనర్‌లు చక్కటి కళాఖండాలుగా పప్పులు, ధనియాలు, బిర్యాని ఆకుల్లాంటివి నాజూకు నగలుగా తయారవుతాయి. ఒక్క ఇవే కావు, ఇంకా ఇలాంటి చాలా కళల్లో అరుణ్‌జ్యోతికి ప్రవేశం ఉంది.

అమ్మ దగ్గర ప్రారంభం
చిన్నప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం... కొత్త పనులను చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టం మొదట కాయిన్స్ కలెక్షన్‌గా మొదలైంది. ఎక్కడ ఏ కొత్త రకం నాణెం దొరికినా జాగ్రత్తగా దాచుకునేదిట. పెళ్లయినా ఆ హాబీని కొనసాగిస్తూ ఇప్పటిదాకా యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు చెందిన దాదాపు పదివేల నాణాలను పోగుచేసిందామె. హైస్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే అమ్మ దగ్గర చీరల మీద ఎంబ్రాయిడరీ, ఇతర అల్లికలు నేర్చుకుంది అరుణ్‌జ్యోతి.

ఉమ్మడి కుటుంబం కావడంతో వాళ్లింట్లో పూటకో వెరైటీ వంటలుండేవట. దీంతో రకరకాల వంటలను చేయడం కూడా నేర్చుకుంది. ఇలా కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం పట్ల తనకున్న ఆసక్తి ...పెళ్లయ్యాక దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగ పర్చుకోవడానికి చాలా ఉపయోగపడిందని చెప్తూ... 'ఇంటర్ పూర్తవగానే నాకు పెళ్లయింది. ఇక్కడా ఉమ్మడి కుటుంబమే. ఏ పనైనా అందరం కలిసి చేసుకునే వాళ్లం కాబట్టి ఇంటిపని త్వరగా అయిపోయేది.

ఆ తర్వాత అంతా ఖాళీయే. అప్పుడే చిన్నప్పుడు నేర్చుకున్న ఎంబ్రాయిడరీ, అల్లికలు మళ్లీ మొదలుపెట్టాను. ఆ ఆసక్తితోనే కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ డ్రెస్ మేకింగ్‌లో డిప్లమా చేశాను. అదే సమయంలో నల్గొండలో జరిగే ప్రతి వంటల పోటీల్లో పాల్గొనేదాన్ని. ప్రతి పోటీలో ప్రైజ్ గెలుచుకునేదాన్న'ని గతాన్ని గుర్తుచేసుకుంది అరుణ్‌జ్యోతి.

ఆపదలోనూ...
అరుణ్‌జ్యోతి వాళ్లబ్బాయి అనీష్‌కి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. బాబును పట్టుకుని తొమ్మిది నెలలు ఆసుపత్రిలో ఉందామె. అంత ఆపదలోనూ కుంగిపోకుండా... తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ... ఒకవైపు కొడుకును చూసుకుంటూనే ఇతర వ్యాపకాల మీద మనసు పెట్టింది. ఆ టైమ్‌లోనే తనకు ఎంతో ఇష్టమైన ఉర్దూ భాషను నేర్చుకుంది.

ఆసుపత్రిలో మంచం మీదున్న బాబును ఉల్లాస పర్చడానికి ఇంట్లో పాడైపోయిన వస్తువులు...డబ్బాలకు తన సృజనాత్మకతను జోడించి రకరకాల బొమ్మలను చేసి చూపించేది. అసంపూర్తిగా మిగిలిన తన చదువుకూ శ్రీకారం చుట్టింది. అట్లా మళ్లీ మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటిదాకా ఆగనే లేదు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేసింది. సమ్మర్ క్యాంపులకు కొడుకుతో పాటు వెళ్లి యోగా, కూచిపూడి నాట్యాన్ని అభ్యసించింది. అభ్యసించి ఊరుకోలేదు. సమయం ఉన్నప్పుడల్లా ప్రదర్శనలు కూడా ఇస్తోంది.


పప్పు నగలు....
ఇప్పటికీ ఆమెలోని సృజనాత్మకత కొత్త కొత్త ప్రయోగాలకు నాంది పలుకుతూనే ఉంది. చీరల మీద జర్దోసీ, ఎంబ్రాయిడరీ పని, సిమెంటు, ప్లాస్టిక్, కంటైనర్లతో రకరకాల కళాకృతులు.... లేటెస్టుగా కంది, పెసర, ధనియాలు, సోంపు గింజలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకులతో వంటింటి వెచ్చాలతో నాజూకైన నగలనూ తయారు చేస్తోంది. పప్పు ధాన్యాలతో కాసుల పేరు, నెక్లెస్, లాంగ్ చైన్‌లను అందంగా అమరుస్తుంది. పప్పులతో చీరల మీద రకరకాల డిజైన్లనూ వేస్తోంది.

ఆమె బంధువులు, స్నేహితుల్లో తాను తయారు చేసిన ఈ జ్యువెలరీకి ఎంతో డిమాండ్ ఉంటోందట. ఇప్పటివరకు ప్రదర్శనకే సరిపోయిన తన కళ ఇక నుంచైనా పదిమందికి ఉపయోగపడాలన్న తాపత్రయంతో....ఫ్రిజ్‌లో కూరగాయలను, పళ్లను పెట్టుకోవడానికి బట్టతో బ్యాగులను కుట్టి, వాటిని అమ్మగా వచ్చిన డబ్బును అనాథలకు అందిస్తోంది అరుణ్‌జ్యోతి. '

ఇన్నాళ్లూ నా కళను కాలక్షేపానికి, పదిమంది ప్రశంసలు పొందడానికే పరిమితం చేశాను. సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడాలని ఇలా బట్టతో సంచీలు కుట్టి అమ్ముతున్నాను. దీని ద్వారా రెండు రకాల మంచి జరుగుతోంది. ఒకటి... ప్లాస్టిక్ వాడకం తగ్గేలా ఎంతోకొంత కృషి చెయ్యడం. రెండవది.. అనాథలకు సాయం చేయడం' అని చెప్పింది. ప్రస్తుతం నల్గొండలో ఒక లేడీస్ గార్మెంట్ షాపును, అలాగే హైదరాబాదులోని బర్కత్‌పురాలో తను డిజైన్ చేసిన చీరలతో మరో షాపునూ నడుపుతోంది ఈమె.

ఇవే కాక 'ఆయుర్వేదం అంటే నాకున్న ప్రత్యేక అభిమానం వల్ల 'అందరికీ ఆయుర్వేదం' అనే అంశానికి ప్రచారం తీసుకురానున్నట్లు' తెలిపింది. తాను చేస్తున్న ఈ పనులన్నింటికీ ఆమె భర్త సతీష్ .ఎన్.లోఖండే, అత్తగారి ప్రోత్సాహం, తోడ్పాటు ఎంతో ఉన్నాయని చెప్పింది అరుణ్‌జ్యోతి.  
సరస్వతి రమ

Friday, October 1, 2010

అమెరికా కంపెనీకి చిక్కిన... అప్పడాల కథ

కథ: కప్పడాలు
రచయిత: తోలేటి జగన్మోహనరావు


గన్ ప్రేమలో పడ్డాడు. గన్ అసలు పేరు గన్ కాదు. గణేష్. ఢిల్లీలో డాండూమ్ అని చదివేసి అమెరికా బాస్‌ల కింద పని చేయడం మొదలుపెట్టాక గణేష్ కాస్తా గన్‌గా మారిపోయాడు. కుర్రాడు కత్తి. మహా చురుకు. కుదురంటే బెరుకు.
ఇంత స్పీడు మీద ఉన్న కుర్రాడు సహజంగానే ప్రేమలో పడతాడు. పడ్డాడు. ఢాం. అమ్మాయి తండ్రి అతగాణ్ణి పిలిచి- నాయనా ప్రేమ సరే, నీ ప్రయోజకత్వం నిరూపించుకో. అప్పుడే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా. నీకు ఒక సంవత్సరం గడువు అని మరోచరిత్ర లెవల్లో ప్రామిస్ చేస్తాడు.

సాధారణంగా ప్రేమించేవాళ్లు అమ్మాయితో పాటు అమ్మాయి బ్యాక్‌గ్రౌండు, ఆ అమ్మాయి యిలాకా, తాలూకా, తండ్రి ఏం పని చేస్తాడు, ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి... ఒకసారి కాకపోయినా ఒకసారైనా చూసుకుంటాడు.
కాని, మన గన్ చూసుకోడు.

కెరీర్‌లో దూకుతాడు. బుల్లెట్‌లా దూసుకుపోతాడు. అమెరికా కంపెనీ ‘కెప్సీ’ భారత్‌లో అడుగుపెట్టి ‘అప్పడాల’ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటే దాని లోకల్ శాఖకు మనవాడే సుప్రీమ్ అవుతాడు. అప్పటికే అంధ్రదేశంలో ‘గణేష్’ అనే కంపెనీ అప్పడాల రంగంలో నంబర్ వన్‌గా ఉంటుంది. దానిని తన కెప్సీతో గన్ దెబ్బ కొడతాడు. తనవి అప్పడాలు కావనీ కప్పడాలని ప్రకటనలతో ఊదరగొడతాడు. చేతితో చేసే అప్పడాల వల్ల టైఫాయిడ్, కలరా, మలేరియా, ఎయిడ్స్ కూడా వస్తాయని ప్రచారం చేస్తాడు.

జనమంతా అప్పడాలు మానేసి కప్పడాలు తినడం మొదలెడతారు.
కెప్సీతో పోరాడలేక ఆఖరుకు గణేష్ కంపెనీ చేతులెత్తేసి మూతపడుతుంది.
గన్ ఇప్పుడు విజేత. ఆ విజయోత్సాహంతో మామగారి దగ్గరకు వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడబోతాడు. కాని అప్పటికే మామగారు వ్యాపారంలో చితికిపోయి ఉంటారు. కట్నకానుకలు యిచ్చే పరిస్థితిలో లేనని కాబోయే అల్లుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటారు.
గన్ ఇవి పట్టించుకోడు. తనకు కావల్సింది కట్నం కాదని కన్య అని చెబుతాడు.
మామగారు సంతోషపడతారు. అందరూ భోజనాలకు కూర్చుంటారు. పనిమనిషి పెరుమాళ్లు యధావిధిగా సాంబారుతో పాటు అప్పడాలు తెస్తాడు. గన్ ఉలిక్కిపడతాడు. ఏమిటి యింకా మీరు అప్పడాలే తింటున్నారా, మా కంపెనీ వారి కప్పడాలు తినడం లేదా అంటాడు.

మామగారి భృకుటి ముడిపడుతుంది. ఇంతకూ నువ్వు చేసే పని ఏమిటి అంటారు. కప్పడాల మార్కెటింగ్ అని చెబుతాడు గన్.
అంతే. మామగారు లేచి గన్ మీద గన్ ఎక్కుపెడతారు. పెరుమాళ్లు సాంబారు బకెట్‌ను గన్ మీద కుమ్మరించడానికి సిద్ధమవుతాడు. పనివాళ్లు అతని వైపు దూసుకువస్తారు. గన్ జరిగిందేమిటో అర్థంగాక కన్నుతప్పి చావు లొట్టబోయి బయటపడతాడు.

ఇంతకు సంగతి ఏమిటి? కప్పడాల దెబ్బకు మూతబడ్డ అప్పడాల కంపెనీ ‘గణేష్’ ఈ మామగారిదే.
రచయిత తోలేటి జగన్మోహనరావు 2001లో ఈ కథ రాశారు. మల్టీనేషనల్ కంపెనీలు ఆఖరుకు ఉప్పూ పప్పుల్లో కూడా అడుగుపెట్టి భారతీయ సంప్రదాయ మార్కెట్‌ను ఎలా ధ్వంసం చేయబోతున్నాయో ఈ కథలో వ్యంగ్యంగా, హాస్యంగా ఎత్తి చూపించారు. ఆయన ఊహించినట్టుగానే అలాంటి కంపెనీలు భారత్‌లో అడుగుపెట్టాయి. చినచేపను పెదచేప మింగినట్టుగా చిన్న చిన్న చిల్లరకొట్లను పెద్దపెద్ద మాల్స్ మింగుతున్నాయి.

ఈ కథ చదువుతున్నంత సేపూ నవ్వు వస్తుంది. కాని, ఆఖరున కళ్లు తుడుచుకుంటే కన్నీళ్లు చేతికి తగులుతాయి.
ఈ కథ ఒక హెచ్చరిక. వర్తమాన విషాదం. ఏడవలేక నవ్వడం.

తోలేటి జగన్మోహనరావు : ప్రసిద్ధ తెలుగు కథకుడు. ‘తోలేటి జగన్మోహనరావు కథలు’ పేరుతో సంపుటి వెలువరించారు. ఢిల్లీలో కేంద్ర సర్వీసులలో పని చేసి, రిటైరై, ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

శమంతకమణి ఎవరో కాదు ...మన సూరమ్మే!

‘రాయడానికి కలానికి చిక్కని గొప్పతనమే గొప్పతనం’ అనే చలం మాటలు ఆయన కథలకూ వర్తిస్తాయి.
మన తృప్తి కోసం మళ్లీ మళ్లీ చెప్పుకోవడమేగానీ ఆ మహా రచయిత కథల గొప్పతనం ఏ కలానికి చిక్కుతుంది?! ‘శమంతకమణితో ఇంటర్‌వ్యూ’ కథ ఏ సంవత్సరంలో చలం రాశారో తెలియదుగానీ ఏ సంవత్సరం చదివినా ఆ సంత్సరం రాసిన కథగా తాజాగా చదివిస్తుంది. వర్తమానానికి పట్టిన నిలువెత్తు అద్దంలానే ఉంటుంది. చలం కాలాతీత కథల్లో ఇదొకటి.
శమంతకమణి ఎవరు? కథానాయకి.

తెనాలికి చెందిన సూరమ్మ సినిమాఫీల్డ్‌కు వెళ్లి శమంతకమణిగా మారుతుంది. లెక్కకు అందని డబ్బు,పేరు ప్రఖ్యాతులు గడిస్తుంది. కీర్తిని, డబ్బును వెతుక్కుంటూ వెళ్లినవారు వెనక్కి తిరిగి రావడమనేది ఉంచదు. ఇది లోకరీతి. బలంగా స్థిరపడిన ఇట్లాంటి లోకరీతిని కాలదన్ని రంగుల లోకాన్ని, కీర్తిని, డబ్బును వదిలేసి ఒకానొకరోజు సొంతూరు తెనాలికి వచ్చి స్థిరపడుతుంది శమంతకమణి.

లోకం మూకుమ్మడిగా ముక్కు మీద వేలేసుకుంటుంది.
శమంతకమణి మనసు మారడానికి కారణం ఏమిటి?
ప్రేమ విరహం అంటారు కొంతమంది. వైరాగ్యమంటారు మరి కొందరు. సుబ్బారావు స్నేహితుడైన రచయిత మాటల్లో కథ నడుస్తుంది. శమంతకమణి తెనాలికి వచ్చి స్థిరపడడానికి గల కారణాలను రకరకాలుగా ఊహించుకోవడం కంటే ఆమెనే అడిగితే సరిపోతుంది కదా అని ఇద్దరూ శమంతకమణి ఇంటికి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక-‘‘శమంతకమణి ఉందా?’’ అని ఇంటిదగ్గర కనిపించిన అబ్బాయిని అడుగుతాడు సుబ్బారావు.

‘‘ఎవరు ఆమె?’’ అని తెల్లబోతాడు ఆ కుర్రాడు.
‘‘సూరమ్మ ఉందా?’’ అని అడుగుతాడు సుబ్బారావు మళ్లీ.
‘‘ఉంది’’ అని చెబుతాడు అతను. ఈ దృశ్యంతో అర్థమయ్యే విషయం ఏమిటంటే శమంతకమణి ఇకముందు ఆ పేరుతో బతకదల్చుకోలేదని మళ్లీ సూరమ్మగానే బతకదల్చుకుందని. సూరమ్మ ఇక సినిమాల్లో నటించదు. జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. స్థలాలు కొనదు. తననెవరూ ఫోటోలు తీసుకోనివ్వదు.

సుబ్బారావు స్నేహితుడు అంటే మనకు కథ చెప్పే రచయిత... సూరమ్మ చిన్నతనంలో ఉండగా ఎత్తుకొని ఆడించాడు. చాలా చాలా కాలం తరువాత సూరమ్మను చూసినప్పుడు ఎత్తుకొని ఆడించిన సూరమ్మ గుర్తుకు రాదు. ఆమె ముఖంలో అందం కంటే స్థిమితమూ, విజ్ఞానం ఎక్కువ కనిపిస్తాయి. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ అప్పుడు ‘వేదాంతసార సంగ్రహం’ చదువుతూ కనపిస్తుంది. ఎక్కడి గ్లామర్ ఫీల్డ్? ఎక్కడి వేదాంతం!!

‘‘మీరిప్పుడు వేదాంత పుస్తకాలు రాస్తున్నారట కదా’’ అని ఆ మాజీ తార అడిగితే - ‘‘నువ్విప్పుడు వేదాంతం చదువుతున్నట్లే’’ అని చెబుతాడు సుబ్బారావు స్నేహితుడు. కొద్దిసేపటి తరువాత వచ్చిన విషయంలోకి దిగుతాడు.
‘‘నువ్వు అంత అకస్మాత్తుగా సినిమాల్ని వదిలి వచ్చేశావు. వేదాంతమా?’’ అని అడుగుతాడు.
‘‘వేదాంతం కాదుగానీ, చాలా వరకు విరక్తి’’ అంటుంది సూరమ్మ. ఆ విరక్తి రహస్యమేమిటో మాత్రం అప్పుడు చెప్పదు. మెల్లిగా కదిలే సంభాషణల్లో ఒక చోట చెబుతుంది ఇలా:

‘‘సంసారం, బంధువులు, స్నేహితులూ అందరూ డబ్బు కోసం ఆశ్రయించేవారే. మొగవాళ్లకి ఫరవాలేదనుకుంటాను. స్ర్తీకి మాత్రం తక్కిన స్ర్తీలూ విరోధులే. అందం ఉన్న తారకి ఆ అందం వల్లనే విరోధులు, మిత్రులూ. అందం లేని నా బోటి దానికి అదీ లేదు’’.

శమంతకమణి ఎలియాస్ సూరమ్మ అశాంతి, ఒంటరితనం, ఆత్మ నలిగిన చప్పుడు కేవలం చలం కథ మాత్రమేనా? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... గుర్తుకు తెచ్చుకుందాం ఒక్కసారి....శమంతకమణిగా మారిన సూరమ్మలు, సూరమ్మగా మారిన శమంతకమణులు!!