Wednesday, November 23, 2011

ఉలి వాడని '' శిల్పి ''

‘నాలుగు రాళ్లు’ వెనకేసుకోవడం అంటే ఆస్తి కూడబెట్టడం అనుకుంటాం మనం...‘నాలుగు రాళ్లు’ పోగేసుకోవడం అంటే అందమైన బొమ్మలను తీర్చిదిద్దడం అనుకుంటుంది ఆమె... ఉలితో చెక్కకుండానే రకరకాల రాళ్లు ఆమె చేతిలో ఒద్దికగా ఒదిగి రూపుకడతాయి.. రతనాల కన్నా రాళ్లనే మిన్నగా భావించే ఆమె పేరు సుజాత. ఉలి వాడని శిల్పిగా ఆమె పరిచయం ..


‘నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకుబెళుకు రాళ్లు తట్టెడేల?’ అంటే.. తళుకు బెళుకులు లేకపోయినా ఫర్వాలేదు రాయి అయితే చాలు అంటారు సుజాత. ఇల్లు కట్టడానికా! పొయ్యి వెయ్యడానికా..? అనే సందేహంతో ఎవరైనా చూస్తే ‘షోకేసుల్లో పెట్టడానికి’ అనే సమాధానం వస్తుంది ఆమె నుంచి. అవును, సుజాత రాళ్లతో బొమ్మలను చేస్తుంది. అదీ ఉలితో చెక్కకుండా. ఉలి లేని శిల్పిగా సుజాతకు, ఆమె చేతిలో రూపు కట్టిన బొమ్మలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు కావాలంటే సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న ఆమె నివాసానికి వెళ్లాలి.

అపురూపం.. ఆ బొమ్మ
ముప్పై అయిదేళ్ల సుజాత చదువుకున్నది టెన్త్ క్లాసే. 2, 5 తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గుండెపోటు వచ్చి ఏపనీ చేయలేని భర్త. ఒకటే అనిపించే రెండు గదుల అద్దె ఇంట్లో నివాసం. ఇదీ సుజాత సామ్రాజ్యం. అందులో ఆమెకున్న ఆస్తిపాస్తులు మాత్రం ఏడాదిగా పోగేసుకున్న వందలకొద్దీ రాళ్లు. సమయం చిక్కితే ఆ రాళ్లను ముందేసుకొని వాటికి బ్రష్‌తో రంగులేస్తూ, ఏ రాయి ఇంకో రాయికి అతికించవచ్చో చూసుకుంటూ ఉంటుంది. కోరుకున్నరూపం వచ్చాక తనకు తాను మురిసిపోతుంది.

తర్వాత కూతుళ్లను పిలిచి తన చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మను చూపించి సంబరపడిపోతుంది. ఆ రాతిబొమ్మను అపురూపంగా తీసుకెళ్లి షెల్ఫ్‌లాంటి చెక్కలపైన నిలబెడుతుంది. రాయి మీద రాయిని పేర్చి బొమ్మలుగా మలుస్తున్న ఈ కళ సుజాతను కోరి కోరి ఎలా వరించిందో తెలపమంటే కళ్లింతలు చేసుకుంటుంది.‘‘ఏడాదిక్రితం మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు. లారీల కొద్ది ఇసుక తెచ్చి పోశారు. ఓ రోజు చుట్టుపక్కల ఆడవాళ్లం ఆ ఇసుకలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. చేతులు ఊరుకోవు కదా! ఇసుకలో అటూ ఇటూ కదుపుతుంటే చేతికి గోధుమ వర్ణంలో ఉన్న ఓ రాయి దొరికింది.


ఆ రాయిని ఎందుకో అక్కడ వదిలేయాలనిపించలేదు. ఇంటికి తెచ్చి షెల్ఫ్‌లో పెట్టాను. రోజూ ఆ రాయిని చూస్తుండేదాన్ని. ఆ రాయితో ఏదో తెలియని అనుబంధం. ఏదో మనసును తట్టే బొమ్మ.. చూడగా చూడగా గణేషుని బొమ్మలా అనిపించింది. బయటకు వెళ్లినప్పుడు ఎమ్‌సీల్(రకరకాల వస్తువులు అతికించడానికి వాడేది), పెయింట్, బ్రష్ కొనుక్కొచ్చాను. తొండం, చెవులు, కిరీటంగా మళ్ళీ రాళ్లు వెతికి తెచ్చి అతికించాను. చూడముచ్చటనైన గణేషుని రూపం. పార్వతీదేవి నలుగుపిండితో గణేషుని తయారుచేసుకుంటే, నేను రాయితో చేశాను అన్న ఆలోచన రాగానే ఉద్వేగంతో కళ్లలో నీరు పొంగింది. ఆ బొమ్మను దేవుని మందిరంలో పెట్టాను.’’ అంటూ తన తొలికళ విఘ్నరాజుతో నిర్విఘ్నంగా వంటపట్టిందని ఆనందంగా చెబుతుంది సుజాత.



రోడ్డుపాలు...
‘ఈ బొమ్మల్ని ఇంట్లో ఉంచితే ఎవరికి తెలుస్తుంది. ఎక్కడైనా ఎగ్జిబిషన్‌గా పెట్టు’ అన్న వాళ్ల మాటలు పట్టుకొని ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో టేబుల్ వేసుకొని దాని మీద రాతి బొమ్మల కొలువు పెట్టింది సుజాత. వచ్చి చూసిన వాళ్లు ‘ఔరా’ అని ఆశ్చర్యపోవడమే తప్ప వాటికి ఎక్కడ గుర్తింపు వస్తుందో చెప్పేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేసింది. హస్తకళల వారిని కలిసి తన బొమ్మలను చూపించింది. బొమ్మలు బాగున్నాయని అన్నవారే తప్ప, ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వలేదు. సభ్యత్వం తీసుకోవాలన్నారు.

అందుకు డబ్బులు కట్టాలన్నారు. ఎక్కడ తీసుకోవాలో, ఎవరిని అడగాలో, ఎంత డబ్బు కట్టాలో తెలియదు. తనకు తెలిసిన ఈ కళ ఇక్కడే మరుగునపడిపోతుందేమో అనేదే సుజాత బాధ. రాతిబొమ్మలకు పేరు తేలేకపోవడం తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడమే కారణమంటుంది. ‘‘అక్క దగ్గర నేర్చుకున్న బ్యుటీషియన్ పనే ఇప్పుడు నా కుటుంబానికి ఆదరవు. తెలిసినవారు కోరితే వారి ఇళ్లకే వెళ్లి బ్యుటీషియన్ పనులు చేసి వస్తాను.


ఇంట్లో నలుగురి కంచంలోకి నాలుగు మద్దలు రావాలంటే ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్లాలి కదా’’ అనే సుజాతకు ఈ బొమ్మల వల్ల ఉపయోగమేంటో తెలియదు. రేపటి తరానికి వాటి ద్వారా ఏం అందించవచ్చో తెలియదు. ఇలాంటి కళకు దేశ విదేశాలలో ఎక్కడెక్కడ, ఎలాంటి పేరుందో! తెలియదు. అందుకే మూలన పడేయడంతో విరిగిన బొమ్మలు, కావాలని అడిగిన వారికి ఇచ్చేసిన బొమ్మలు, పిల్లలు ఆడుతూ ఆడుతూ రోడ్డు మీద వదిలేసి వచ్చిన బొమ్మలు, ప్రాణం చివుక్కుమన్నా స్థలం సరిపోక వద్దనుకున్న బొమ్మలు ఎన్నో... కాని రాయి కనపడితే చాలు అది ఏ బొమ్మగా రూపుకట్టవచ్చో ఆలోచన చేస్తుంది. దానిని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్ది బొమ్మను చేస్తుంది. ఈ ఉలి చెక్కని బొమ్మల విలువ తెలిసినవారెవరైనా వాటికో స్థానం క లిపిస్తే చాలనుకుంటుంది సుజాత.


కళలు తెలిసిన వారు అరుదు. తమకు తాముగా నేర్చుకుని కళకు ప్రాణం పోసే వారు మరీ అరుదు. స్వతహాగా అబ్బిన ఈ కళ సుజాత జీవితాన్ని సుసంపన్నం చేస్తుందని ఆశిద్దాం.


ఒకటికి ఒకటి...
‘‘బయట ఏదైనా రాయి కనిపిస్తే చాలు, దానికి సరిపోయే రాయి నా దగ్గర ఏది ఉంది? అని చెక్ చేసుకుంటాను. కొన్ని రాళ్లు పక్షుల రెక్కల్లా ఉంటే కొన్ని తలల్లా, మనుషుల చేతుల్లా.. ఏదో ఒక అవయవ రూపంలో కనిపిస్తాయి. ఒకటి దొరికనప్పుడు దానికి అనువైన మరో రాయి దొరికే దాకా ఎదురుచూడక తప్పదు’’ అంటూ రాతిబొమ్మల రూపకల్పనలో పట్టే సమయాన్ని వివరిస్తుంది ఆమె. తిమింగలం, నెమలి, చేప, కప్ప, ఎలుక, జూజూ, గుర్రం, కుక్క, జోకర్, ఏలియన్ మాస్క్, మర్రిచెట్టు, శివలింగం, రామచిలుకలు, వృద్ధుడు, రాకాసి, ... చెప్పుకుంటే పోతే వందల కొద్ది బొమ్మలు సుజాత చేతిలో రూపుకట్టి మనల్ని అబ్బురపరుస్తాయి.

- నిర్మలారెడ్డి
ఫొటోలు: అమరశ్రీనివాసరావు. వి

Monday, May 30, 2011

జానపద ఉద్యమానికి తెర తీస్తున్న స్నేహలత

పాటల పొదరిల్లు

చిన్ని శిశువుకు జోలపాట, కాస్త పెద్దయ్యాక లాలిపాట, తర్వాత పెళ్లి పాట, పండుగంటే పాట, నలుగురు కలిస్తే పాట... తెలుగునాట ప్రతి సందర్భమూ పాటతో ముడిపడి ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ సంస్కృతి వెనకబాట పట్టినా ఇప్పుడు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. స్త్రీల పాటలు, జానపదాలను సేకరించడమే కాకుండా, చక్కని స్వరంతో అభినయంతో వాటిని పడుతూ పదిమందికీ చేరువచేస్తున్న కళాకారిణి స్నేహలత. ఆ పనిలో ఆమె లీనమయ్యే తీరూ, వ్యక్తీకరణలోని ఎనర్జీ... కళ్లు తిప్పనివ్వవు. వ్యవహారిక భాషోద్యమాన్ని ముందుండి నడిపించిన గిడుగు రామ్మూర్తి మునిమనవరాలైనందుకు ఆ స్ఫూర్తిని కూడా అందిపుచ్చుకుని ఒక జానపద ఉద్యమానికి తెర తీస్తున్న స్నేహలత పంచుకున్న విశేషాలు.
http://www.hindu.com/mp/2009/02/14/images/2009021452880901.jpg
"సమాజం కూడా నిస్తేజంగా మారిపోయినట్టనిపించింది. సంగీత సాంస్కృతిక అంశాలనెవరూ పట్టించుకునేవారే లేకపోయారు. సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నవారే కాదు, హాయిగా గొంతెత్తి చక్కగా ఏ పాట పాడగలిగేవారికైనా శ్రోతలు లేకుండా పోయారు. మీరు గమనిస్తే ఆ స్థితి దాదాపు ఇరవయ్యేళ్లు కొనసాగింది. తర్వాత ప్రైవేటు ఛానెళ్లు పాటల కార్యక్రమాలు పెట్టడం, అవి నెమ్మదిగా ఊపందుకుని సీరియళ్లను మించి ప్రేక్షకాదరణ పొందడం మొదలయ్యాక మళ్లీ సంగీత రంగంలో కదలిక వచ్చింది..''

"హైదరాబాద్ ఇప్పుడున్నట్టు ఉక్కిరిబిక్కిరి చేసేది కాదు. మేముండే సరూర్‌నగర్ ఒక పల్లెటూరు. ఆకుకూరలు కావాలంటే అప్పటికప్పుడు కోసుకురావడం, చింతచెట్ల నీడల్లో బాగా ఆడుకుని సాయంత్రం కాగానే పిల్లలంతా చేరి మూసీ నది ఒడ్డున స్నానాలు చేసి రావడం - ఇలా ఉండేది. మా నాన్న గిడుగు రాజేశ్వర్రావు, అమ్మ సీతలది ప్రేమ వివాహం కావడంతో మాకు బంధువుల కన్నా మిత్రుల స్నేహమే ఎక్కువ. దాంతో చుట్టుపక్కల ఉండే పల్లెపడుచులతోనే ఆటపాటలన్నీ.

అలా ఇక్కడి జానపదం నాకు తొలిగా చిన్నవయసులోనే పరిచయమైంది. వదినామరదళ్ల హాస్యాలు, బతుకమ్మ పాటలు మా అమ్మ గిడుగు సీత బాగా పాడేది. మద్రాసులో ఉండగా సినిమాల్లోనూ నటించింది. ఇంట్లో ఎప్పుడూ ఆమె నోటిలో పాటలు నానుతూ ఉండేవి. దాంతో నాకూ అదే అలవాటయింది. తర్వాత నేను గాత్రమూ వీణా నేర్చుకోవడానికి గురువుల దగ్గర చేరాను. అదిగాక చిన్నప్పటి నుంచే నాన్న పాటలకు రాగాలు కడుతూ, వాటిని పాడటమూ ఒక సరదాగా ఉండేది. ముఖ్యంగా మా పనమ్మాయి ఊర్మిళ. నన్ను తీసుకుని ఒగ్గు కథలకూ బతుకమ్మ ఆటలకూ తీసుకెళ్లేది...'' అంటూ తన సంగీత నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు స్నేహలత.

బతుకమ్మ బతకాలి...

ఊర్మిళ పల్లెపడుచే కావొచ్చు. ఆమె నింపిన స్ఫూర్తి స్నేహలతలో అణువణువునా నిండిపోయింది. రంగురంగుల బతుకమ్మ, రకరకాల పాటలు ఆమెను ఆకర్షించాయి. దాంతోనే బతుకమ్మ పాటల సేకరించి, వాటి నేపథ్యాలనూ తెలుసుకున్నారు. అయితే వాటిని జనంలోకి తీసుకెళ్లడం పెద్ద సమస్య అయి కూచుంది. "టీవీలో, రేడియోలో ఎక్కడయినా బతుకమ్మ పాటలు పాడదామంటే ఎవరూ కలిసొచ్చేవాళ్లు కాదు. వాటిని పాడటం ఏమిటని ఆశ్చర్యపోయేవారు.

ఒకావిడయితే రికార్డింగ్ వరకూ వచ్చాక 'ఇలాంటి పాటలు మా ఆయన పాడొద్దన్నారండీ' అనేసి వెళ్లిపోయింది. ఇప్పటికీ కొందరిలో అలాంటి భావన ఉన్నా నెమ్మదిగా మార్పు వస్తుంది. బతుకమ్మ బతుకు కోరే తల్లి. ప్రకృతిలో పుట్టి మనల్ని నడిపించి పకృతిలో లీనమయ్యే శక్తి. బతుకమ్మ ఆటలో పేదాగొప్పా పిల్లా ముసలీ తేడాలేం లేవు. కులమతాల పట్టింపు లేదు. అంత గొప్ప సంస్కృతిని ఒంటపట్టించుకుని అందరికీ తెలియజెప్పాలనేదే నా లక్ష్యం. అందువల్లే డీడీ రోజుల నుంచీ నేను బతుకమ్మ పాటల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను...'' అని చెప్పుకొచ్చారు స్నేహలత.

ఒక్క స్వరమూ వినిపించలేదు...

"ఒక దశలో దూరదర్శన్ ప్రాభవం వెనుకబట్టింది. కొత్తగా వచ్చిన ఛానెళ్లు - అయితే వార్తలకూ లేదంటే సీరియళ్లకూ పెద్దపీట వేశాయి కళారూపాలకూ సంగీత కార్యక్రమాలకూ చోటు కల్పించలేదు. అప్పుడు సమాజం కూడా నిస్తేజంగా మారిపోయినట్టనిపించింది. సంగీత సాంస్కృతిక అంశాలనెవరూ పట్టించుకునేవారే లేకపోయారు. సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నవారే కాదు, హాయిగా గొంతెత్తి చక్కగా ఏ పాట పాడగలిగేవారికైనా శ్రోతలు లేకుండా పోయారు. తమ విద్యను ప్రదర్శించడానికి వేదికలే ఉండేవి కాదు. మీరు గమనిస్తే ఆ స్థితి దాదాపు ఇరవయ్యేళ్లు కొనసాగింది. తర్వాత ప్రైవేటు ఛానెళ్లు పాటల కార్యక్రమాలు పెట్టడం, అవి నెమ్మదిగా ఊపందుకుని సీరియళ్లను మించి ప్రేక్షకాదరణ పొందడం మొదలయ్యాక మళ్లీ సంగీత రంగంలో ఒక కదలిక వచ్చింది...'' అంటూ విశ్లేషించారు స్నేహలత. వసంతం వచ్చేవరకూ కోయిల గొంతు వినిపించదు.

ఎక్కడో దాక్కుని నిశ్శబ్దంగా సాధన చేస్తుంది. స్నేహలత కూడా ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. కొన్నేళ్లపాటు కుటుంబానికే పూర్తి సమయం కేటాయించారు. "అలాగని ఖాళీగా ఉన్నాననుకుంటే పొరపాటే. పాటలకు రాగాలు కట్టడం, నాలో నేనే పాడుకోవడం. మా అమ్మాయి మాధవీలతకు నేర్పించడం. ఇదిగాక ఏ శుభకార్యాలు జరిగినా, బంధుమిత్రులను కలిసినా వాళ్లకు తెలిసిన పాటలను రాసుకునేదాన్ని. వారెలా పాడతారో గమనించి అవసరమైతే మార్పుచేర్పులు చేసుకునేదాన్ని. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏయే సందర్భాల్లో ఏమేం పాడతారో తెలుసుకున్నాను. ఒకేపాటను మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా పాడేవీ ఉన్నాయి. ఆ తేడాలను తెలుసుకున్నాను. ఇదంతా వ్యక్తిగత తృప్తి, అధ్యయనాల కోసం చేసినవే...'' అన్న స్నేహలత ఆ కాలంలో మూడొందలకు పైగా పాటలు సేకరించారు.

సంగీత బృందం

ఆవిడ అనుకోలేదుగానీ, తర్వాత కాలం మారింది. సంప్రదాయం, జానపదం, ఆధ్యాత్మికం... ఏదైనాసరే, పాడేవారికి మంచి రోజులొచ్చాయి. టీవీ ఛానెళ్లే కాదు, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పాటకే పెద్ద పీట వేస్తున్నారు. నేటి ఈ ధోరణిని అందిపుచ్చుకుని స్నేహలత తనకో బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సందర్భానుసారం బతుకమ్మ పాటలను వ్యాప్తిచేస్తున్నారు. శుభకార్యాల్లో ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. "ఇప్పుడు 'సంగీత్' అని పెళ్లి వేడుకలకు రెండు రోజుల ముందే మొదలవుతున్నాయి. సినిమా పాటల ఆర్కెస్ట్రా, డీజేలకు బదులు కొందరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అసలు మన పెళ్లిళ్లలో ఎన్ని పాటలో. ముహూర్తం పెట్టి పసుపు దంచింది మొదలు, నలుగు పాట, విడిది పాట, వియ్యపురాలి పాట, భోజనం బంతి పాట, పూలచెండ్ల పాట, అప్పగింతల పాట... ప్రతి సందర్భానికీ పాటలేపాటలు...'' అంటున్న స్నేహలత తన కార్యక్రమంలో కేవలం వాటిని పాడేసి ఊరుకోరు.

పాటల సమయసందర్భాలను, వాటిలోని సాహిత్యాన్నీ అందాన్నీ పరిచయం చే స్తూ జనరంజకంగా సాగుతుందామె కార్యక్రమం. "మొదట్లో పెద్దలే ఎక్కువగా ఆనందించేవారు. యువత రాన్ని ఆకట్టుకోకపోతే ఈ పాటలు భవిష్యత్ తరాలకు ప్రవహించవని అర్థమయింది. అందువల్ల పెళ్ళిళ్లకు వెళ్లినప్పుడు వాళ్లతో మాట కలుపుతాను. పాటలకు అనుగుణంగా అప్పటికప్పుడు వాళ్లతో చిందేయిస్తాన''ని చెబుతున్న స్నేహలత తానూ పాదం కలిపి పదం పాడతారు. మామూలుగా ఈ కార్యక్రమం పెళ్లివారందరూ కొత్తాపాతా తేడా లేకుండా కలిసిపోవడానికి, యంగ్ తరంగాలకు జోష్‌నందించడానికే అయినా దానికి మించిన గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తున్నారామె. ఏదైనా విజయవంతమయిందనడానికి సూచిక దానికి అనుకరణలు రావడమే. ఇప్పుడు స్నేహలతలాగే 'పెళ్లి పాటలు పాడతాం' అంటూ మరో పాతిక బృందాలు తయారయ్యాయంటే ఆమె ప్రయోగం విజయవంతమైనట్టే. "నేనా మరొకరా అని కాదు. పాటలు పదిమందికి చేరాయా లేదా అన్నదే ముఖ్యం. అలా ఆలోచించినప్పుడు ఈ పాతిక బృందాలూ నాకు పోటీ అనిపించవు...' అని హుందాగా చెబుతున్న ఆమె తీరు గొప్పగా అనిపిస్తుంది.

Thursday, May 19, 2011

అశేష కీర్తి గిరి చిత్రాలు * కొండపల్లి శేషగిరిరావు

seshagiri_pic3
కొండపల్లి బొమ్మలు ఈ తరం వారికి కొత్తేమోగానీ పాతతరం వాళ్ల ఇళ్లల్లో కొలువుతీరి ఉంటాయి ఆ కొయ్యబొమ్మలు. ప్రత్యేకించి బొమ్మల కొలువుల్లో కొండపల్లి బొమ్మలు ఉండితీరాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందిన కొండపల్లి బొమ్మలు చూడటానికి అచ్చం కొండపల్లి శేషగిరిరావు గీసిన బొమ్మల్లానే ఉంటాయి. అంతలా జీవకళ ఉట్టిపడుతుంటుంది శేషగిరిరావుగారి కళాత్మక చిత్రాలలో. ఆదరణ కరవై కొండపల్లి బొమ్మలకు గిరాకీ తగ్గిందిగానీ అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గవు కొండపల్లి బొమ్మలు. అంతగా గుర్తుకుతెచ్చే కొండపల్లినే ఇంటిపేరుగా చేసుకుని శేషగిరిరావు అనే ప్రసిద్ధ చిత్రకారుడు తన విశేష పేరుప్రతిష్టలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయక యావత్‌ భారతావని మెచ్చే స్థాయికి వ్యాప్తిచెందడమంటే అంత తేలికైన విషయం కాదు. ఎనిమిది పదుల వయసులోనూ వన్నెతగ్గని కళాఖండాలను ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంటారు ఆయన. ఇంటిపేరు కొండపల్లి అయినా శేషగిరిరావు పుట్టింది మాత్రం తెలంగాణకే తలమానికమైన పోరుగడ్డ వరంగల్‌ జిల్లాలోని పెనుగొండలో 1924 సంవత్సరంలో జన్మించారు. పెనుగొండలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసి వరంగల్‌ ప్రాంతంలో ఉన్నత విద్యను అభ్యసించారు ఆయన.

seshagiri_pic 

లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్రా : పౌరాణిక, దృశ్య కావ్య నాయకానాయికలను, మనసుకు హత్తుకుపోయే వివిధ సుందర దృశ్యాలను మనోహరంగా చిత్రించడమేకాక కుడ్య చిత్రలేఖనంలో కూడా శేషగిరిరావుకు సాటి ఆయనే అనిపించుకొన్నారు. కొండపల్లి వేసిన బొమ్మలు పరోక్షంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’ అనే అతి బృహత్తర చిత్రం అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో వేదిల మీద మనకు కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వాటిని చూడటం తటస్తించివుంటుంది. కాకపోతే చాలామందికి ఆయన పేరు మాత్రం తెలియదు. టీవీ ఛానల్స్‌, వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రజలు ఏదో ఓ సందర్భంలో ఆ చిత్రాన్ని తిలకించి ఉంటారు.అయితే ఆ చిత్రం ‘కొండపల్లి’ శేషగిరిరావుదే అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియనే తెలియదు.

seshagiri_pic1 

సైన్స్‌ మాస్టార్‌ స్ఫూర్తి : కోటిరత్నాల వీణ తెలంగాణలో వేయిస్తంభాల గుడి, అరుదైన చారిత్రక కళాసంపదను చాటుతున్న వరంగల్‌ ప్రాంతంలో జన్మించిన కొండపల్లి శేషగిరిరావు చిన్నతనంలోనే సామాన్యశాస్త్రంలో గీయవలసిన బొమ్మల్ని తన పాఠ్యపుస్త్తకంలో ఉన్నదానికన్నా ఎంతో అందంగా చిత్రించేవారు. చిన్నతనంలోనే కొండపల్లి శేషగిరిరావులో ఉన్న సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ అయిన దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. దీంతో కొండపల్లి కళాచతురతను ప్రప్రథమంగా ఆ పాఠశాల డ్రాయింగ్‌ టీచరు దీనదయాళ్‌ గుర్తించారు. పెన్సిల్‌తో ఏ రేఖలు ఎలా గీయాలో, కుంచెతో ఏ రేఖల్లో జీవం ఎలా నింపాలో దీనదయాళ్‌ సార్‌ మన కొండపల్లికి నేర్ఫారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్ఫింది. రామప్ఫ గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం..శిల్పక్షేత్రాల శిల్ఫకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్నివందల చిత్రాలతో ఆ శిల్ఫకళకు దర్ఫణం పట్టారు. శిల్ఫుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజాబాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.

seshagiri_pic2 

వరంగల్‌లో విద్యాభ్యాసం, చిత్రకళాభ్యాసం తర్వాత ఆయన హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌ చిత్రకళాశాలలో డిప్లొమా పొందారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఆయనకి నవాజ్‌ మిహిది నవాజ్‌తో పరిచయం కలిగింది. కొండపల్లి చిత్రకళా ప్రతిభ గుర్తించిన నవాజ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినిేకతనంలో అధునాతన చిత్రకళా రీతుల్ని అధ్యయనం చేయడంవల్ల తగిన ఫలితం ఉంటుందని సూచించి, సహకరించడంతో కొండపల్లి ‘శాంతినిేకతన్‌’లో ప్రవేశించారు. సర్వకళలకు పుట్టినిల్లయిన శాంతినిేకతన్‌లో అప్పుడు నంద్‌లాల్‌బోస్‌ చిత్రకళా విభాగంలో ఉండేవారు. ఆయన కొండపల్లి కళాప్రతిభని గుర్తించారు. పాటించాల్సిన జాగ్రత్తలేమిటో నేర్ఫారు. ఆయన నేర్ఫిన మెలకువలతో కొండపల్లి ప్రతిభ బాగా వికసించింది. అక్కడే ‘కుడ్య’ చిత్రలేఖనంలో కూడా కొండపల్లి ప్రత్యేక శిక్షణ పొందారు. 1950లో హైదరాబాద్‌లో చిత్ర కళాపోటీలు భారీఎత్తున జరిగాయి. అఖిలభారత స్థాయిలో జరిగిన ఆ పోటీల్లో కొండపల్లి చిత్రం ప్రథమ బహుమతి సొంతం చేసుకొంది. ఆ సభలో పాల్గొన్న అప్ఫటి మంత్రి, కొండపల్లి చిత్రాన్ని ప్రశంసించడమే కాక హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ క్రాఫ్ట్‌‌సలో అధ్యాపకుడిగా కొండపల్లి శేషగిరిరావు పేరును ప్రతిపాదించారు.

అలా ఉద్యోగం చేపట్టిన కొండపల్లి శేషగిరిరావు ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆయన కళాత్మకత రాజకీయ నాయకులను విశేషంగా ఆకట్టుకోవడంతో హైదరాబాద్‌, బెంగళూరు, భావనగర్‌లలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు ద్వారాలు, వేదిక రూపకల్ఫన బాధ్యతలు కొండపలిే్లక అప్ఫగించారు. అవి అప్ఫటి ప్రధానమంత్రుల అభినందనలు అందుకొన్నాయి. అప్ఫటి ప్రభుత్వం చొరవతోనే ఆయన ‘‘లైఫ్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ అనే బృహత్తర చిత్రాన్ని చిత్రించారు. అది అనేక పర్యాయాలు రవీంద్రభారతి, తెలుగు లలిత కళాతోరణం వంటి వేదికల మీద జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శితమై ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఆయన ఉపాధ్యాయుడిగానే మిగిలిపోకుండా చిత్రకళా విస్తృతికి తానెంతో కృషిచేశారు. పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై ఎన్నో గ్రంథాలు కూడా రాశారు. 1982లో ఉద్యోగ విరమణ అనంతరం కూడా తన దగ్గరకొచ్చే వారిని నిరాశపరచక మెలకువలన్నీ నేర్ఫారు. 1987 మే ఆరో తేదీన హైదరాబాద్‌లో ‘మాడపాటి సుకుమార్‌’ అవార్డు అందుకొన్న కొండపల్లి చిత్రకళా సాధన, బోధనల్లో ‘కొండపల్లి బొమ్మలంత’ సుస్థిర కీర్తిప్రతిష్టలను పొందారు.

మాస్కో, లండన్‌, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిఙత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమేనంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

-నండూరి రవిశంకర్‌

ముచ్చటగొలిపే ముప్పిడి చిత్రాలు

అతనొక ఉపాధ్యాయుడు...సృజనాత్మకత కలిగివున్న సామాజిక చిత్రకారుడు కూడా...మారుమూల కుగ్రామంలో ముదిరాజ్‌ కులంలో జన్మించి పల్లెటూరి జీవన విధానంపై అందమైన చిత్రాలను వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న అద్భుత చిత్రకారుడు అతడు. పేరు ముప్పిడి విఠల్‌. చిన్నతనం నుంచి అతని కళ్లముందు ఉట్టిపడే పల్లెల ప్రకృతి అందాలే ఆయనకు స్ఫూర్తిదాయకమయ్యారు. మెదక్‌ జిల్లాలోని కంగ్డిలోని తడ్కల్‌ గ్రామంలో ఒక నిరుపేద గ్రామంలో జన్మించారు విఠల్‌.

mupidi-pic 

పదవతరగతి వరకు స్వగ్రామంలోనే విద్యనభ్యసించిన విఠల్‌ ఇంటర్మీడియట్‌ నిజామాబాద్‌ జిల్లా బిచ్కుందలో పూర్తిచేశారు. తండ్రి లక్ష్మయ్య, తల్లి నాగమ్మ. నలుగురు సంతానంలో రెండవ సంతానం విఠల్‌. 1995లో సావిత్రితో వివాహం జరిగింది. ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు మంచి ఆర్టిస్టులుగా ఎదుగుతై తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

రైతుకుటుంబం నుంచి వచ్చిన విఠల్‌ పేదరికం అనుభవించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ సాగారు. వివేకవర్ధిని డిగ్రీకాలేజీలో చదువు సాగిస్తూ ఉదయం పార్ట్‌టైమ్‌ జాబ్‌ కింద పెయింటింగ్స్‌ వేస్తూ తన సొంతకాళ్లమీద నిలబడి ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ సెకండియర్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్‌‌సలో మారి (పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) బి.ఎఫ్‌.ఏ. పూర్తిచేసారు. అనేక ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసి ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నారు. చిన్ననాటినుంచి ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషిచేసి తన కుంచె నుంచి జాలువారిన అపురూప చిత్రాలు అశేష జనాదరణను పొందాయి. నిజానికి విఠల్‌కు స్ఫూర్తిగా నిలచినది కిషన్‌ మహరాజ్‌. ఆయన విఠల్‌ చదివిన హైస్కూల్‌కు హెడ్‌మాస్టర్‌గా ఉండేవారు. చిన్నతనం నుంచి విఠల్‌లో దాగివున్న సృజనాత్మకతను మొట్టమొదటిసారిగా గ్రహించి ఎంతగానో ప్రోత్సహించేవారు. అలాగే పోచాపూర్‌ మెగలప్ప అనే మరో ఉపాధ్యాయుడు విఠల్‌ను ఆర్టిస్టుగా ఎదిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించారు. ఒకరకంగా ఈ ఇద్దరు ఉపాధ్యాయ గురువులు తన జీవితానికి మార్గదర్శకులయ్యారు అంటారు విఠల్‌.
గ్రామీణ వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చిత్రాలు వేయడంలో ఎంతో దిట్ట విఠల్‌. 1994 సంవత్సరంలో హైదరాబాద్‌లోని జాంబాగ్‌ వద్ద గల వివేకవర్ధిని కళాశాలలో విఠల్‌ వేసిన వివేకానంద చిత్రపటానికి గాను కళాశాల యాజమాన్యం మెచ్చుకోలుగా కళాశాల తరపున బెస్ట్‌ అవార్డును అందజేసింది. 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్విహంచిన సౌత్‌ జోన్‌ చిత్రలేఖనం పోటీలలో రజిత పథకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1997లో నిర్వహించిన జన్మభూమి చిత్రలేఖనం పోటీల్లో రాష్టస్థ్రాయిలో మూడవ బహుమతిని అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి చేతులమీదుగా అందుకున్నారు.
ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం పట్టిపీడిస్తున్న సమస్య. ఇటివంటి కాలుష్యాన్ని నివారించేందుకు తన చిత్రాల ద్వారా నేటి తరం విద్యార్థులలో చైతన్యం కలగజేసేందుకు కృషిచేస్తున్నారు. ఆ దిశగా కృషిచేస్తూ తన పెయింటింగ్‌ ఎగ్జిబిషన్ల ద్వారా అనేక మందికి మార్గదర్శనం చేస్తున్నారు.

mupidi-pic1 

బహుమతులు: 1998 సంవత్సరంలో నిర్వహించిన అంతర్‌ విశ్వవిద్యాలయం చిత్రలేఖనం పోటీలలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి రంగాచార్య చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం జరిగింది. అలాగే 2000 సంవత్సరంలో జరిగిన ముదిరాజ్‌ మహాసభల్లో విఠల్‌ వేసిన కార్గిల్‌ వార్‌ చిత్రాలకుగాను బంగారు పతకం లభించింది. అప్పట్లో దేశభక్తిని పెంపొందించే ఆ చిత్రాలతో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ కార్యక్రమం జరిపిద్దామనుకున్నారు విఠల్‌. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ కార్యక్రమం రూపుదిద్దుకోలేక పోయింది. అన్నీ కలిసొస్తే తొందరలోనే ఆ దేశభక్తిని రూపొందించే పెయింటింగ్స్‌తో ఒక పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలనేది ఆయన ఆశయం. 2002 డిసెంబర్‌ 31న శబరిమలైలోని దృశ్యాలను చూసి వాటిని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించినందుకుగాను శ్రీరాం ఇంటీరియర్స్‌ వారు బంగారు ఉంగరంతో ఘనంగా సత్కరించారు. అలాగే తన సొంత ఊరైన తడ్కల్‌లో అప్పటి దొరగారి కోట చిత్రాన్ని వేసి పోటీలకు పంపించారు విఠల్‌. ఈ చిత్రం రాష్టస్థ్రాయిలోనే చిత్రకళా ప్రదర్శనకు ఎంపికయింది. తన సొంత ఊరిలోని కోటను తన చేత్తో గీసుకుని ఎంతో తృప్తిని పొందానంటారు ఆయన.

mupidi-pic2 

ఆశయం: కాంటెంపరరీ ఆర్టిస్టుగా ఎదగాలని ఆకాంక్ష. ఇతర దేశాలలో కూడా మన దేశ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉండాలని నా ఆశయం. మారుమూల పల్లె వాతావరణం ప్రపంచవ్యాప్తం కావాలని...అన్ని దేశాలలో కూడా ప్రత్యేకించి మన పల్లెవాతావరణం ఇనుమడింపజేయాలనేదే తన ఆశయం అంటారు విఠల్‌.

పిల్లలకు అవగాహన: చిన్నారుల్లో దాగివున్న సృజనాత్మకత శక్తిని వెలికితీస్తూ ...వారిని చిత్రకారులుగా తీర్చిదిద్దుతూ చిత్రలేఖనంలో వారికి ప్రోత్సాహం అందించేందుకుగాను 1999లో హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌లో ముప్పిడి ఆర్ట్‌‌స గ్యాలరీని విఠల్‌ ప్రారంభించారు. ప్రతిసంవత్సరం వేసవికాలంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఆయన. తను పుట్టిపెరిగిన ప్రాంతపు పల్లె పొలాల స్థితిగతులే తన చిత్రాలకు ప్రేరణలంటారు విఠల్‌. అక్కడి ఎండిపోయిన చెరువులు, బీడులువారిన భూములు, ఎండిపోయిన పిల్లకాలవలు, పల్లె ప్రాంతంలో జనజీవన స్థితిగతులు...తన సొంత పొలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో చూసిన దృశ్యాలనే తన పెయింటింగ్స్‌కు స్ఫూర్తిదాయకంగా పనికొచ్చాయంటారు విఠల్‌. నేటి తరం విద్యార్థులు కూడా పల్లె ప్రాంతాలను అలక్ష్యం చేయకుండా...పూర్తిగా సిటీ జీవనానికే అలవాటుపడకుండా అక్కడి ప్రాంతాలను కూడా సందర్శించాలంటారు విఠల్‌. అలాగే నేడు ప్రతి పాఠశాలలోనూ ఒక చిత్రలేఖనం నేర్పించే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలంటారు విఠల్‌. పిల్లలకు కేవలం చదువు ఒక్కటే పరమావధికాదని...చదువుతో పాటు ఇలా ఏదో ఒక కళమీద వ్యాపకం చాలా మంచిదని...ప్రస్తుత విద్యావిధానంలో అది లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు విఠల్‌. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు చిత్రకారులుగా మలిచే ఉపాధ్యాయులను నియమించాలంటారు. అలాగే తన సొంత మండలంలో ఒక వృద్ధ ఆశ్రమాన్ని నెలకొల్పాలనేది ఆయన ఆశయం అంటారు.

-నండూరి రవిశంకర్‌

Thursday, March 17, 2011

చిత్తరాల పూలతోట

madhu-d1ఏడు పదుల వయసుకు దగ్గరౌతున్నా...ఆయన కుంచెకు వన్నె తగ్గదు...ఆయన చిత్రాలకు ఖ్యాతి తగ్గదు...పల్లె పడచుల పైట అందం...పైరగాలుల తన్మయత్వం...ఆత్మీయానుబంధాల మేళవం...అన్నీ కలగలిపితే తోట వైకుంఠం అవుతుంది. తెలంగాణ ప్రాంతానిేక తలమానికంగా భాసిల్లుతున్న తోటవైకుంఠం భావోద్వేగాలను పలికింపజేసే చిత్రాలకు చిరునామాగా చెబుతారు. ప్రఖ్యాత సామాజిక స్పృహ కలిగిన మేటిదర్శకుడు బి.నరసింగరావు తన చిత్రాలకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అంతా తోట వైకుంఠానిక అప్పగించేవారు. 1942లో కరీంనగర్‌లో పుట్టిన తోట వైకుంఠం చిత్రకళాకారుడిగా అనన్యసామాన్యమైన పేరును సంపాదించుకున్నారు.

కిరాణాకొట్టు నడిపిస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్న సామాన్యమైన వ్యక్తి ఆయన తండ్రి. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బూరుగుపల్లి ప్రాంతంలో పుట్టిన తోట వైకుంఠం చిన్నప్పటినుంచి కూడా సాదాసీదా జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. చిన్నతనంనుంచి కూడా తోట వైకుంఠానికి తాను పుట్టిన ప్రాంతమన్నా...పల్లెవాతావరణమన్నా ఎంతో మక్కువ. అందుకే ఆయన గీసిన చిత్రాలలో ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తాయి ఆ చిత్రాలు.

madhu-dతన అభిరుచికి తగినట్లుగానే విద్యను కూడా అదే మార్గంలో కొనసాగించారు వైకుంఠం. అందుకు తండ్రి కూడా ఎటువంటి అభ్యంతరమూ పెట్టలేదు. ఎటువంటి షరతులు కూడా విధించలేదు. కొడుకు ఇష్టప్రకారమే చదివించారు. తోట వైకుంఠం తన అభిరుచికి తగినట్లుగా ఫైన్‌ ఆర్ట్‌‌స, ఆర్కిటెక్చర్‌ కోర్సులను హైదరాబాద్‌లో పూర్తిచేశారు. ఫైన్‌ ఆర్ట్‌‌స విద్యార్థులకు బోధకునిగా కొన్ని విద్యాసంస్థలలో పనిచేశారు.

తెలంగాణ సంస్కృతి మనకు ఆయన చిత్రాలలో అణువణువూ స్మృజిస్తుంది. దాసి చిత్రానికిగాను వైకుంఠం కళాదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి కేంద్రస్థాయిలో ఉత్తమ కళాదర్శకునిగా తోట వైకుంఠం అవార్డును అందుకోవడం విశేషం. ‘రంగుల కల’ చిత్రం ఓ చిత్రకారుని గురించిన అంశం. ఆ చిత్రాన్ని దర్శకుడు బి.నరసింగరావు ఎంతో హృద్యంగా తెరకెక్కించిన తీరు నభూతో నభవిష్యతి. ఇక ఆ చిత్రకారుడు గీసే బొమ్మలన్నీ సినిమా తెర వెనక గీసిన వ్యక్తి తోట వైకుంఠం. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అందుకే నరసింగరావు తన ప్రతిచిత్రంలోనూ ఏదోఒకరకంగా తోట వైకుంఠం పాల్గొనేలా చేస్తారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. వైకుంఠానికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చెట్టూ పుట్టా తిరిగి కాయకష్టం చేసి అలసి, సొలసిన శ్రమజీవులు మానసిక విశ్రాంతిని, పొందడానికి కళలను నమ్ముకొని తెలంగాణలో వేలాది మంది కళాకారులు బ్రతుకు బండిని కొనసాగించేవారు. ఇలాంటి ప్రాశస్త్యం కల్గిన విశిష్ఠ కళలతో పరవశించే తెలంగాణ పల్లెల ప్రకృతి అందాలను తోట వైకుంఠం తన కుంచెతో మన మనసుల్లో నిలిచిపోతారు.

నండూరి రవిశంకర్‌

Wednesday, March 16, 2011

కూచిపూడికి వేదాంతం వెలుగులు!

కూచిపూడి నాట్యం అనగానే ఈ తరం వాళ్లకు ఖరీదైన ఆహార్యం, ఆర్భాటాలు కళ్ల ముందు పరుచుకుంటాయి. అరుదైన ఓ కళను ముందుతరాలకు నేర్పుదామనే ధోరణి కంటే ఏదో ఒక నాట్యం నేర్పితే పదిమందిలో పిల్లలకు పేరు వస్తుందన్న ఆలోచనే ఈ తరం వారిలో ఎక్కుగా కనిపిస్తున్నది. తెలుగువారి సొంతమైన కూడిపూడి నాట్య వికాసానికి సినీరంగ ప్రయోక్త వేదాంతం రాఘవయ్య చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన సేవల్ని ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం ఇది.
కూచిపూడి నేర్చుకునే ప్రతి కళాకారుడూ ఆడి, పాడగల ప్రావీణ్యం పెంచుకోవడంతో పాటు ఆడవేషం కట్టగలిగితేనే రాణిస్తారని నిరూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంతం రాఘవయ్య.

భారతీయ నృత్య సంప్రదాయాలలో అన్నింటికన్నా ప్రాచీనమైన యక్షగానం ఆధారంగా ఏర్పడిన కూచిపూడి విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, ముందుతరాలకు అందించేందుకు పలువురు పెద్దలు ఎంతో కృషి చేశారు. అలాంటి వారిలో పేరెన్నిక గన్న వ్యక్తి వేదాంతం రాఘవయ్య.

నిన్నటి తరం సినీ దర్శక, నిర్మాతగా మాత్రమే ఎక్కువ మందికి తెలిసిన ఈయన అద్భుతమైన కూచిపూడి నాట్యకారుడు. ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాలను నిర్మించిన ఈయన కూచిపూడి కళ మరింత వికసించేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన బహుముఖ కళా ప్రజ్ఞలో సినీనిర్మాణం, దర్శకత్వం, నృత ్యదర్శకత్వం, స్క్రీన్‌ప్లే, కథారచన, నటన వంటివి ఎన్నో ఉండడం విశేషం. ఆయన కళానైపుణ్యాలలో కూచిపూడి అంటే వేదాంతం వారికి ఎంతో మక్కువ. ఆ కళను మరింత సుసంపన్నం చేసి ముందుతరాలకు అందిం చాలని ఆశించారాయన.

తెల్ల తెర నుంచి వెండి తెర దాకా....
సంచార బృందాలతో పల్లె పల్లెల్లో వాడవాడల్లో ప్రదర్శించే భాగవతుల మేళా నుంచి కూచిపూడిగా పరివర్తనం చెందింది. కూచిపూడి పోకడల్ని ముందుగానే గమనించిన వేదాంతం రాఘవయ్య ప్రమాణికమైన ఆధునిక నృత్యరీతుల్ని, సిలబస్‌గా రూపొందించడానికి ఎంతో శ్రమించారు. 'దేవదాసు', సువర్ణసుందరి', స్వర్ణమంజరి' వంటి చక్కని చిత్రాల్ని రూపొందించడంతో పాటు 45 సినిమాల నిర్దేశకుడిగా తన ప్రతిభాసంపత్తి పంచి పెట్టారు.

రైతుబిడ్డ (1939)లో నటించిన రాఘవయ్య నాటి మద్రాస్‌లో వందలమందిని తన శిక్షణతో తొలితరం నర్తకులుగా తీర్చిదిద్దారు. కూచిపూడి అగ్రహారంలో విరిసిన 'యక్షగానం' కుసుమాన్ని ఆధునిక చిత్రసీమలో పరిమళించేలా చేశారు. 1934లో బందరు (మచిలీపట్నం)లో ఉద్దండ సంపాదకుడు, ముట్నూరి కృష్ణారావు వ్యాఖ్యానంతో విమలేంద్రు బోస్ చూపించిన విడివిడి నృత్యాంశాల్ని వేదికపై చూసిన రాఘవయ్య మృష్టాన్న భోజనం వంటి రూపకాల ముందు ఇవి చిరుతిళ్లలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మారుతున్న కాలమాన పరిస్థితుల్ని చప్పున ఆకళింపు చేసుకున్న ఆయన చిత్రసీమలో తన నాట్యంతో కొత్త రీతులను పరిచయం చేశారు. కోట్లాది మంది తెల్లతెరపై రెండు రంగుల్లో మాత్రమే చూసిన నాట్యం రంగురంగుల్లో యక్షగానంలో కళకళలాడేలా చేశారు. వెంపటి పెదసత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వంటివారు నృత్యంలో సత్తా చూపిస్తున్న కాలంలో వేదాంతం రాఘవయ్య నాట్యంతో పాటు సినిమా దర్శకుడిగా మహాప్రజ్ఞ కనబరిచారు. నెత్తి మీద నీళ్ల చెంబు, పదునైన అంచుల పళ్లెంపై పాదాలతో నర్తించే 'తరంగం' రాఘవయ్య శైలి 'రీతి'తో వందల మంది నర్తకులపై ప్రభావం చూపించింది.

రాఘవయ్య యుగం
1960వ దశకంలో జాతీయ స్థాయిలో కొందరు పెద్దలు కూచిపూడి నృత్యం కేవలం జానపదం, అందులో శాస్త్రీయత ఏమీ లేదని కొట్టిపారేసి చులకనగా చూసిన సందర్భం రాఘవయ్య ప్రజ్ఞకు సవాలు అయింది. అప్పుడు బండా కనకలింగేశ్వరరావు, ప్రొఫెసర్ విస్సా అప్పారావు, నటరాజ రామకృష్ణ వంటి వారు విరుచుకుపడి ఉద్యమంగా స్పందించారు. వారి వాదనలకు మద్దతుగా రాఘవయ్య అధ్యయన పత్రాలు, ప్రసంగాలతో అంతా తల వంచి మొక్కేలా చేశారు. కూచిపూడి గురువుల తరంలో తొట్టతొలిగా ప్రభుత్వం నుంచి భరత కళాప్రపూర్ణ బిరుదు సత్కారాల్ని అందుకోవడం కూచిపూడి వ్యాప్తికి దోహదం చేసింది.

పాతికేళ్ల వయసులో ఆయన పొందిన ఖ్యాతి 52వ ఏట మరణించే నాటికి వేలవేల మంది ఆయన అభిమానులుగా మారేలా చేసింది. సమగ్ర సంగీత, సాహిత్య రూపకంగా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఆస్వాదించే 'యక్షగానం'లో రాఘవయ్య తనదైన శైలి ముద్రతో జేజేలు అందుకున్నారు. మన నాట్య గురువుల బాణీలో కళాత్మకత వికసించేలా చేశారు. ప్రాచీన గ్రంథాలయాలు ప్రత్యేకించి తంజావూరులోని సరస్వతి మహల్‌లో మన నాట్యంపై ఉన్న మహత్తర గ్రంథాల్ని నాట్యాభిమానులకు అందేలా చేయాలని తపించారు. 1964లో రవీంద్రభారతి ప్రాంగణంలో జరిగిన అఖిల భారత నాట్యోత్సవంలో అధ్యక్షుడుగా ఆయన చెప్పినవి, సూచించినవి తరువాతి తరం వారికి ఆదర్శ పాఠాలు అయ్యాయి.

మార్గదర్శి
భరతనాట్యం, కథాకళి, కథక్, ఒడిస్సీ, మణిపూరి నాట్య సంప్రదాయాల్ని మాత్రమే ప్రదర్శిస్తే చాలదన్నారు. జానపద నృత్యాలు, ఎన్నెన్నో ప్రక్రియలు ఉన్నాయంటూ వాటిని రప్పించి, చూస్తే మన కూచిపూడి వాసి పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభాకర నాట్యమండలిని స్థాపించి, జనం మెచ్చేలా కొత్త కొత్త ప్రక్రియల్ని అందించారు. ఆ రోజుల్లో వేదాంతం రాఘవయ్య రూపొందించిన 'హంటర్ డాన్స్' కొరియోగ్రఫీకి పాఠం లాంటిది అని గురువులు చెప్పుకొనేలా చేశారు.

అనార్కలి, బాలనాగమ్మ, రహస్యం సినిమాల్లోని కోరాడ నరసింహరావు, గిరిజా కల్యాణం వంటివి అన్ని వర్గాల వారు అద్భుతం అంటూ మెచ్చుకుంటూ చూసినవే! భరతనాట్యంలో గోపీనాథ్‌ల వంటి వారు ప్రవేశపెట్టిన ఆధునీకరణ సంస్కరణల వంటివి రాఘవయ్య ద్వారా కూచిపూడిని ప్రభావితం చేశాయి. సాధన, శిక్షణ, ప్రదర్శన వంటి రంగాల్లో వేదాంతం వారి ఒరవడి పలువురు గురువులకు అడుగుజాడ అయింది.

తనయుడి తపన
ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న రాఘవయ్య కుమారుడు రామచంద్ర వరప్రసాద్ తమ పెద్దల బాణీలను దృశ్య మాధ్యమంలో అందుబాటులోకి తేవాలని పరితపిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పద్మభూషణ్ వెంపటి చిన సత్యం నిర్వహించే కూచిపూడి ఆర్ట్ అకాడమీలో అధ్యాపక కళాకారుడిగా ఉన్న రాము పాత కొత్తల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోని కళారూపాల్లో మేటిగా చెప్పుకోదగ్గ 'యక్షగానం' దాదాపుగా కనుమరుగైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుతరాల వారికి మన నృత్య నాటకాల వైభవం తెలియాలంటే ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 'డాక్యుమెంటేషన్' అవసరమని సూచిస్తున్నారు. 36 దాకా లెక్కకు వచ్చే కూచిపూడి యక్షగానాలు ఇప్పుడు కొద్దిమందికి కూడా తెలియకుండా పోయాయంటున్నారు. వేదాంతం రాఘవయ్య కుమారుడిగా 45 ఏళ్ల పైబడిన నాట్యరంగ అనుభవంతో ఉదాత్తమైన కళారంగ సమాచారం, తండ్రి కృషిని దృశ్యమాధ్యమంగా నిక్షిప్తం చేయాలని తలపెట్టారు. సినిమా ప్రముఖుడిగా తన తండ్రిని తలచుకునేవారికి ఆయన నాట్యవ్యాప్తి కోసం పడ్డ ఆరాటం, తపన అందించిన మెళకువలు అన్నీ తెలియజెప్పాలని ఉందంటున్నారు. ఈ రంగంలో ఆసక్తి కలవారు ఇంకా వివరాలు, జ్ఞాపకాల కోసం చె న్నైలోని రామును 94448 53333 ఫోన్‌నంబర్‌లో సంప్రదించవచ్చు.
- జిఎల్ఎన్ మూర్తి

Sunday, January 23, 2011

టీవీల్లో చేస్తే మర్యాద .... మేం చేస్తే అమర్యాదా .. ?

ఇన్నేళ్ల తరువాత మీరెరిగిన జీవితం ఎలా వుందని ఆమెని ప్రశ్నిస్తే? తడుముకోకుండా 'ముళ్లకంప భోగం' అని సమాధానమిచ్చారు. దానిని మరింత వివరంగా చెబుతూ'ముళ్లకంపలో చిక్కుకుంటే రక్తాలు కారతాయండీ. భరించలేని బాధ పెడుతుందండీ. అలాగని చావు కూడా రాదండీ. భరించాలండీ' అంటారు. ఆరుతరాల కళావంతుల కుటుంబ వారసత్వంలో గొల్లకలాపం, భామా కలాపాలు తెలిసిన ఆఖరి కళాకారిణి అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు. కలాప సంప్రదాయాలపై హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్జాతీయసదస్సుకు ఆమె హాజరయ్యారు. కలాపాలు నేర్చుకున్న తీరు నుంచి సమాజంలో భోగంఆటలు రద్దుచేశాక మారిన పరిస్థితుల వరకు చాలా విషయాలపై మాట్లాడారు...

మాది తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని ఉమ్మిడివరం గ్రామం. అక్కడి ఉమాసూరేశ్వరస్వామి ఆలయంలో మా వాళ్లంతా ఆలయ నర్తకీమణులు. అందులో ఆరుతరాల వారసత్వం మాది. మా అమ్మమ్మ బుల్లివేంకటరత్నం చనిపోయేవరకు ఆ దేవుని సేవలోనే వున్నారు. అప్పట్లో అలా సేవలో వుండేవారిని పెద్ద బుల్లి, చిన్న బుల్లి అని పిలిచేవారు. ఆమె దగ్గరి నుంచి మా అమ్మ అన్నాబత్తుల సత్యభామ వెంగమాంబ రాసిన గొల్లకలాపాన్ని నేర్చుకున్నారు. దీంతోపాటు భామాకలాపం అభ్యసించారు.

అప్పట్లో ఏటా ఐదురోజులు సూరేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిగేది. ఐదు రోజులూ కార్యక్రమాలు వుండేవి. కుంభహారతి, పుష్పవర్ణం మా అమ్మమ్మ జరిపేది. స్వామి రథోత్సవంలో కళావంతుల కార్యక్రమాలు వుండేవి. రథానికి ముందు మందబయలు ఏర్పాటు చేసేవారు. కాగడాలతో అందరూ చుట్టూ నిల్చుంటే క్షేత్రయ్య పదాల నుంచి జావళీల వరకు అన్నిటినీ ప్రదర్శించడం ఆనవాయితీ. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం. వాటిల్లోనే గొల్లకలాపం, భామా కలాపం వుండేవి. దేవుని మాన్యంలో దాదాపు వంద కళావంతుల కుటుంబాలకు 25 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు చాకలిమాన్యం, మంగలి మాన్యం కూడా వుండేవి. తరువాత కాలంలో దేవదాసి వ్యవస్థను రద్దుచేశాక భూస్వాములు, పెత్తందారులు వాటిని అమ్మించేసి తామే కొనుక్కున్నారు. కళావంతుల పరిస్థితి దారుణమైపోయింది.

సూర్యుడు మేల్కొన్న రోజులు...
కలాపాలను నేర్చుకోవడానికి కఠోర శ్రమ చేయాల్సిందే. మా అమ్మే నా గురువు. ఆమె మమ్మల్ని వేకువజామున నిద్రలేపేవారు. దానికి సమయం ఏమీ లేదు. పడుకున్న తరువాత ఏ జామున మెలకువ వస్త్తే అప్పటి నుంచి అభ్యాసం జరగాల్సిందే. శరీరానికి పూర్తిగా తైలం రాసేవారు. ఒక్కోసారి తైలం పూతకే గంట పట్టేది. ఆ తరువాత మొగ్గలు వేయించేవారు. దేహం రాటుదేలాలి మరి. గట్టిపడాలి. పురుషుని సామర్థ్యానికి సమానం కావాలి. దాదాపు మూడు గంటలకు పైగా ప్రదర్శనలివ్వాలి. ఒక్కోసారి రాత్రంతా కార్యక్రమాలు వుంటాయి. అంతేకాదు కల్యాణోత్సవాల్లో వరుసగా కలాపాలు వుంటాయి. ఇదంతా తట్టుకోవడానికి ఆ శ్రమ అవసరం.

మొదటి ఐదు సంవత్సరాలూ ఇదే దినచర్య. ఆ సమయంలో శరీరంతో సంబంధం లేకుండా కొ న్ని భాగాలు(మెడ, కళ్లు వగైరా) కదపడం కూడా నేర్పుతారు. అప్పుడే అడవిసాము నేర్పించారు. ఐదు సంవత్సరాల తరువాత గొల్లకలాపం, భామాకలాపం, జావళీలు, క్షేత్రయ్య పదాలు నేర్పించేవారు. ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసేవి. ఆపై వీటిని కల్యాణోత్సవాల్లో ప్రదర్శించాలి. ఇప్పుడైతే గానం ఒకరిది, నృత్యం ఇంకొరిది. కానీ అప్పుడు రెండూ నృత్యకారిణే చేయాలి.

ఊరికి నిప్పంటుకుంది...
గొల్లకలాపం ఆడటంలో మా అమ్మమ్మకు ఎంతో పేరుంది. అందులో ఆమెకు దివ్యత్వం వుందనేవారు. దానికి ఒకటి రెండు నిదర్శనాలు కూడా వున్నాయి. వండ్ర అనే గ్రామంలో దేవుని మాన్యం కింద ఎకరా భూమి మాకిచ్చారట. ఆ ఊళ్లో దేవుని పెళ్లికి, ఇతర శుభకార్యాలకు మా అమ్మమ్మ గొల్లకలాపం ఆడేది. ఒక సంవత్సరం అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వండ్రలో గొల్లకలాపం ఆడలేదు. కొన్నిరోజులయ్యాక ఆ ఊరు అగ్నికి ఆహుతైపోయింది.

దానికి కారణం గొల్లకలాపం ప్రదర్శించకపోవడమనే నమ్మకం ఆ ప్రజల్లో కలిగింది. ఆ తరువాత సంవత్సరం అమ్మమ్మ ఆడింది. కొన్నాళ్లకు అమ్మమ్మ వెళ్లలేని పరిస్థితులొచ్చాక గొల్లకలాపం..గొల్లకలాపం అంటూ నాలుగు మాట అక్కడ చెప్పేవారట. మేజువాణి, భోగం ఆటలను అమ్మమ్మ ముందే వదిలేసింది. గొల్లకలాపం, భామాకలాపం పై ఎక్కువ ఆసక్తి చూపేది. అమ్మమ్మకు ఆఖరి రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నంచి పతకాలు అందాయి. 1978లో అమ్మమ్మ చనిపోయింది. మేము అంతటితో కలాపాలను విడిచిపెట్టేసి, తాళం, గజ్జలను పెట్టెలో పెట్టేశాము.

నృత్యనికేతన్‌తో మళ్లీ ఆరంభం...
గొల్లకలాపం పూర్తిగా వేదాంతపరమైనది. ఇందులో జ్ఞానం, విజ్ఞానం రెండూ వుంటాయి. గొల్లభామ, బ్రాహ్మణునికి మధ్య సంవాదమే గొల్లకలాపం. బ్రహ్మజ్ఞానం పొందడానికి ఏంచేయాలనేది చెప్పడంతోపాటు పిండోత్పత్తిశాస్త్రం కూడా ఈ కలాపంలో వుంటుంది. రెండు వందల సంవత్సరాల క్రితమే వెంగమాంబ దీనిని రాయడం ఒక అద్భుతం. దీనిని ఆడటానికి ఎంతో సహనం, ఓపిక కావాలి. ఆపై ఆదరించాలి. ఇవి రెండూ కొరవడి కలపాలను వదిలేశాము.

1985లో కళాకృష్ణ వచ్చి కలాపాలను ఎవరికైనా నేర్పాలని, వాటి అవసరం వుందని చెప్పారు. అలా నృత్యనికేతన్ మొదలు పెట్టాము. దాదాపు మూడు వందల మందికి ఈ కలాపాలను నేర్పించాము. కానీ ఇప్పుడు ఎంతమంది వాటిని ప్రదర్శిస్తున్నారు, వారికి పదాలపై, జావళీలపై ఎంత అవగాహన వుందని ప్రశ్నిస్తే మాత్రం నిరాశే మిగులుతుంది. ఒకసారి మా దగ్గర నేర్చుకున్నవారు నారాయణపేటలో గొల్లకలాపం ప్రదర్శించారు. అది టీవీలో చూసి మా అమ్మ బాధపడింది.

సంపూర్ణంగా నేర్చుకోమనీ, ఇంకా అభ్యాసం అవసరమనీ, అసంపూర్ణ ప్రదర్శన ఇవ్వడం కళకు అన్యాయమనీ...అంచేత గొల్లకలాపాన్ని ప్రదర్శించవద్దని ఉత్తరం కూడా రాసింది. 2008లో అనుకుంటా ఒకసారి వరంగల్‌లో ఒక సదస్సుపెట్టారు. అక్కడితో అయిపోయింది. మా కళను తమదిగా చెప్పుకుంటూ చాలామంది ఇప్పుడు లాభపడుతున్నా కనీసం కళాకారుల గుర్తింపుకార్డులు సైతం పొందని దురదృష్టం మాది. గత ఏడాది 'శతరూప' అంటూ రాజధానిలో కళలను ప్రోత్సహించే కార్యక్రమం పెట్టారు. అప్పుడూ మేము గుర్తురాలేదు.

ఆకలి భోగం వద్దన్న వాళ్లు...
వివాహాల్లోనూ, వేడుకల్లోనూ కళావంతులు భోగం ఆటలు, మేజువాణిలు ఆడేవారు. మేజువాణిలో పదిమంది వేదికపై వుంటే, ఇద్దరు ముందుకు వచ్చి నాట్యం చేసేవారు. అప్పుడే ఎంకిపాటలు, టుమ్రీలు, జావళీలు, క్షే త్రయ్య పదాలు ఆడేవారు. కొంతమంది కుర్రాళ్లు ఏదైనా సినిమా పాటలకు ఆడమనేవారు. అదంతా ఆకలి తీర్చుకోవడానికే ఆడేవారు. మగాళ్లంతా కలసి దానిని వద్దన్నారు. సమాజానికి చెడు అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి. టీవీల్లో షోలు, డాన్సులు అంటూ అదే ఓపెన్‌గా చేస్తున్నారు.

అంతకంటే ఎక్కువగా హీరోయిన్లను అనుకరిస్తూ, ఇంకా కురచ దుస్తులు ధరించి డాన్సులు చేస్తుంటే దానికి సమాజంలో పేరున్న వారంతా న్యాయనిర్ణేతలుగా వుంటున్నారు. వేలవేల రూపాయలు ఇస్తున్నారు. ఇదేమి న్యాయం?... సమాజం ఇప్పుడు చెడిపోదా?... కళావంతుల మాన్యాలు దోచుకున్నారు. చిన్న చూపు చూశారు. అప్పటి కళావంతుల నృత్యాలకు పేర్లు మార్చి, పద్ధతులు మార్చి వేలు వేలు సంపాదించుకుంటున్నారు. సమాజం ఇప్పుడు చెడిపోదా?...

సమాజం ద్వంద్వ వైఖరులపై లక్ష్మీమంగతాయారు ఎక్కుపెట్టిన ప్రశ్నలివి. జవాబులు చెప్పడం మనందరి బాధ్యత.

బల్లెడ నారాయణ మూర్తి, ఫొటోలు: భాస్కర్